జగన్ అభ్యర్థి ఎఫెక్ట్: అసెంబ్లీకి మోదుగుల, వద్దని అలక
నర్సరావుపేట ఎంపీ సీటుకు రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తఱపున అయోధ్య రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తన బావ పైన పోటీ చేయనని మోదుగుల గతంలో అధిష్టానానికి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే, నర్సారావుపేటను ఇప్పటికే రాయపాటి సాంబశివ రావుకు కేటాయించినందున మోదుగులకు ఇవ్వలేమని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
నర్సారావుపేట బదులు అదే జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు ఇస్తామని టిడిపి ఆయనను బుజ్జగిస్తోంది. గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల సీటును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గుంటూరు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థులుగా గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివ రావు ఖరారయ్యారని, అందులో పునరాలోచన లేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
నరసరావుపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని మోదుగుల చెబుతున్నారు. ఎంపీ గరికపాటి మోహన్ రావును కలిసి మోదుగుల తన వాదన వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్లో తనకు అవమానం జరిగిందని, మళ్లీ అక్కడికే వెళ్లి సీమాంధ్రకు న్యాయం చేసి ప్రతీకారం తీర్చుకొనే అవకాశం కల్పించాలని కోరుతున్నానన్నారు. తనకు కలలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. నరసరావుపేట నుంచి తన బావ అయోధ్య రామిరెడ్డి జగన్ పార్టీ తరుపున పోటీ చేయడం గురించి మోదుగుల మాట్లాడుతూ రాజకీయం వేరు, బంధుత్వం వేరన్నారు.