టిడిపి శాంతియుతం,నల్లబ్యాడ్జీలు,జపాన్ తరహా...పోరాటానికేనా?
Recommended Video
అమరావతి: సిఎం చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో కేంద్రపై పోరాటానికి అవలంభించాల్సిన పద్దతులపై ఆ పార్టీ నేతలు తప్ప మిగిలిన పక్షాలన్నీ పెదవి విరుస్తున్నాయి.
ఇకనైనా తాడో పేడో తేలుస్తారనుకుంటే చంద్రబాబులో ఇంకా నాన్చుడి ధోరణి పోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కన్నా తమ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పావులు కదుపుతున్నట్లే ఉందని విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం జరిగిన అఖిలపక్షం సమావేశం తరువాత చంద్రబాబు చేసిన తీర్మానం తీరుతెన్నులు చూస్తే నొప్పించక తానొవ్వక తీరులో ఉందే తప్ప కేంద్రం మెడలు వంచే ధోరణిలో లేదని వారంటున్నారు.
చంద్రబాబు...ఏం తేల్చారంటే?...
అఖిలపక్షం సమావేశం తరువాత చివరగా ఏకపక్షంగా చేసిన తీర్మానంలో చంద్రబాబు ఏం తేల్చారంటే...కేంద్రంపై చేసే పోరాటం శాంతియుత పద్ధతిలో కొనసాగాలని... నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని, జపాన్ తరహాలో అదనపు పనిగంటలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని, దీనికి ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. అయితే ఎవరిని తీసుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకుండానే సమావేశాన్ని ముగించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ తీర్మానంపై టిడిపి, ఏవో కొన్ని అనుకూల సంఘాలు మినహా మిగిలిన పక్షాలన్నీ ప్రతికూల అభిప్రాయమే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ పద్దతి మనకి సెట్టవుతుందా?...వర్కవుట్ ఔతుందా?...
అయితే చంద్రబాబు చెబుతున్న ఈ శాంతియుత ఆందోళన ఫార్ములా ప్రస్తుత మన దేశ రాజకీయ పరిస్థితులని బట్టి చూస్తే ఏమాత్రమైనా వర్కవుట్ అయే పరిస్థితి ఉందా?...అంటే లేదంటున్నాయి విద్యార్థి సంఘాలు...ప్రజెంట్ పొలిటికల్ సినారియోని బట్టి, కేంద్రంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి అది అసాధ్యమనే అంటున్నారు. జపాన్ తరహా అభివృద్ది అంటే ఓకే కాని జపాన్ తరహా ఆందోళన అంటే భారతదేశానికి ఆ పద్దతి సెట్టవుతుందా?...భారతదేశంలో ఎక్కడైనా ఇప్పటివరకు ఆ తరహా పద్దతి మన దేశంలో ఎక్కడైనా సత్పలితాన్ని ఇచ్చిందా?...అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణా సాధన కోసం...చేసిన పోరాటాలు...
కళ్ల ముందు అంతెందుకు తెలంగాణా సాధన కూడా ఏ స్థాయిలో ఆందోళన చేస్తేనే సాధ్య పడిందని ఎపి హక్కుల కోసం కూడా ఆ స్థాయిలో పోరాటం జరగాల్సిందేనని...లేకుంటే కేంద్రానికి చీమకుట్టినట్లయినా ఉండదని విద్యార్థి సంఘాలు తేల్చేస్తున్నాయి. శాంతియుత పోరాటమంటే ఎక్కడ? ఎలాగో చెప్పకుండా ఎవరు ఉన్న చోట వారు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని పనిచేస్తూ ఉంటే కేంద్రానికి చురుకు ఎలా తెలుస్తుందని...ఈ వ్యవహారం ఎంతమంది నల్ల బ్యాడ్జీలు ధరిస్తారో చూద్దామన్న తీరుగా ఉందే తప్ప లక్ష్యసాధన దిశలో లేదని విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా స్పందన...ఆందోళన స్థాయిని బట్టే...నిర్ణయాలు
అయితే అంతిమంగా కేంద్రమైనా, రాష్ట్రమైన ప్రజా స్పందనను బట్టి...నిర్ణయాలు తీసుకుంటాయనేది బహిరంగ రహస్యం. అయితే రాష్ట్రానికి న్యాయం చేసే విషయాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది మరచిపోకూడదంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. నిజంగా ఆందోళన చేయాలనుకుంటే రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి చిత్త శుద్దితో పతాక స్థాయిలో పోరాటానికి సిద్దం కావాలని, ఆ దిశలో అందరినీ సమాయత్తం చేయాలని...నాన్చివేత ధోరణి...టిడిపికే కాకుండా...రాష్ట్రానికి కూడా చేటు చేస్తుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి.