అందరి జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ టీడీపీనే...చెప్పనవి కూడా చేశాం:చంద్రబాబు
విశాఖపట్టణం: సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినవే కాకుడా...చెప్పనవి కూడా చేస్తున్నామన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. అయినా కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. త్వరలోనే నిరుద్యోగ భృతికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో పేదవారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ టీడీపీనేనని తేల్చిచెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీనే ముందుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.