ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
గతానికంటే భిన్నంగా లోకేష్ ప్రసంగం ఉందని, నేతలో దూకుడు పెరిగినట్లు కనపడుతోందంటూ తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు.
జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడిచి, దాదాపుగా 125 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేసి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్ర ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా లోకేష్ పాదయాత్ర సాగనుంది.
తొలిరోజు కుప్పంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లి యాత్రలో కాలు కదిపారు. ఎప్పుడూ అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వని లోకేష్ ఆరోజు నిరాంతరాయంగా ప్రసంగించారు. అక్కడక్కడ కాస్త తడబడినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పంచ్ డైలాగులు పేల్చారు. గతానికంటే భిన్నంగా లోకేష్ ప్రసంగం ఉందని, నేతలో దూకుడు పెరిగినట్లు కనపడుతోందంటూ తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు.
మొదటిరోజు బాలయ్య, తారకరత్న పాల్గొన్నప్పటికీ అనారోగ్యంతో తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మినహా పాదయాత్ర సజావుగానే ప్రారంభమైంది.. సజావుగానే సాగుతోంది. సమయం, సందర్భాన్ని బట్టి లోకేష్ పంచ్ డైలాగులు పేలుస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలు కూడా లోకేష్ ప్రసంగించగానే వరుసపెట్టి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు.
వాహనంపైకి ఎక్కి ప్రసంగించడంతో ప్రచార రథాన్ని పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. దీనిపై లోకేష్ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగానే యాత్రకు దూరంగా ఉన్నారు. తాను పాల్గొంటే మీడియా ఫోకస్ మొత్తం తనపై పడుతుందని, లోకేష్ కు రావాల్సిన ప్రచారం రాదనే కోణంలో ఆలోచించారు. తనను తాను తీర్చిదిద్దుకోవడంతోపాటు ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు కావాలో అవన్నీ 400 రోజుల సుదీర్ఘ పాదయాత్రద్వారా అలవడతాయనేది చంద్రబాబు అంచనా. ఈ అంచనాను లోకేష్ అందుకుంటారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాలంటే పాదయాత్ర ముగిసేవరకు ఎదురుచూడక తప్పదు.