లోకేష్ సంతకాలు- కేంద్రం అవార్డులు- అయ్యన్న కామెంట్లు....రసవత్తరంగా రాజకీయం...
ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అచ్చెన్నను ప్రభుత్వం వేధిస్తోందంటూ నిత్యం విపక్ష నేత చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు ట్వీట్ వార్ సాగిస్తుంటే అందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా దీటుగా బదులిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు కుటుంబ పరామర్శకు వెళ్లిన సందర్భంగా చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి ట్వీట్లు కలకలం రేపుతుండగా... దీనికి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు షాకింగ్ కౌంటర్ ఇచ్చారు.
విజయసాయిరెడ్డి ట్వీట్లపై...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను నిత్యం టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వార్ సాగించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో విపక్ష నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో వారు కూడా ఒక్కొక్కరుగా సాయిరెడ్డి ట్వీట్లకు స్పందించడం సర్వసాధారణంగా మారుతోంది. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో సాయిరెడ్డి తన వ్యంగ్యం జోడించి ట్వీట్లు పెట్టారు. ఇది కాస్తా టీడీపీ నేతలకు మంట పుట్టించింది. దీంతో పార్టీ నేతలంతా ఒక్కొక్కరిగా సాయిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు.
లోకేష్ సంతకాలకు కేంద్రం అవార్డులు...
అచ్చెన్నాయుడు కుటుంబ పరామర్శ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ లోకేష్... ఒక్క సంతకం పెడితేనే అరెస్టు చేస్తారా అలాగైతే నేను వంద సంతకాలు పెట్టానని చెప్పారు. ఈ వ్యాఖ్యలను సాయిరెడ్డి టార్గెట్ చేయడంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇవాళ ట్విట్టర్ లో స్పందించారు. లోకేష్ పెట్టిన సంతకాలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందంటూ సాయిరెడ్డికి చురకలు అంటించారు. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు పలు అంశాల్లో లోకేష్ అవార్డులు అందుకున్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు సాయిరెడ్డికి గుర్తు చేశారు.
Recommended Video
లోకేష్ ప్రెస్ మీట్ లైవ్...
ఆ తర్వాత లోకేష్ ప్రెస్ మీట్ పై సాయిరెడ్డి చేస్తున్న కామెంట్లపై కూడా అయ్యన్నపాత్రుడు స్పందించారు. లోకేష్ ప్రెస్ మీట్ లైవ్ అని మీ అల్లుడు జగన్ లా రికార్డింగ్ కాదనే అర్ధం వచ్చేలా అయ్యన్న ట్వీట్ లో చురకలు అంటించారు. ప్రశాంత్ కిషోర్ తో ట్రైనింగ్ ఇప్పించినా సరే మీ అల్లుడు జగన్ లైవ్ ప్రెస్ మీట్ లు ఇవ్వలేకపోతున్నాడని, అందుకే లోకేష్ లైవ్ ప్రెస్ మీట్లు చూసి ఊగిపోతున్నారని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లోకేష్ ప్రెస్ మీట్ ను టార్గెట్ చేయాలనుకున్న సాయిరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లయింది. అదే సమయంలో ఈ వివాదంలో సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో సీఎం జగన్ ను కూడా టీడీపీ ఇందులో లాగినట్లయింది.