ఎమ్మెల్యే శ్రీదేవి దళితురాలే కాదు... ఆ అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది అన్న మాజీ మంత్రి
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కులవివక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పటంతో కులవివక్ష వ్యాఖ్యలు, ఆమె పెట్టిన కేసుల విషయంలో టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇక చంద్రబాబు వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఆమె స్వయంగా తన నోటితో తానే తాను క్రిస్టియన్ అని చెప్పారని , అలాంటప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది అని ప్రశ్నించారు. తాజాగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎపిసోడ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు .
విశాఖ భూ కుంభకోణంపై సిట్... గజం భూమి కబ్జా చేసినా కఠిన చర్యలు, పీడీ యాక్ట్ అన్న మంత్రి
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల దూషణ వ్యవహారంలో దళిత ఎమ్మెల్యేను దూషించిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రులు డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆమె దళితురాలే కాదని ఆరోపిస్తోంది. స్వయంగా ఆమె ఆ విషయాన్ని అందరి ముందు చెప్పారని చెప్తున్నారు టీడీపీ నేతలు . ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఆమెకు ఎలా వర్తిస్తుందని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే దళితురాలే కాదని స్పష్టం చేశారు. ఒక క్రిస్టియన్ అయ్యుండి అట్రాసిటి కేసు ఎలా పెడతారని నిలదీశారు. ఇక పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారని మండిపడ్డారు.
ఎస్సీ నియోకవర్గంలో దళిత ఎమ్మెల్యేగా తాను క్రిస్టియన్ అయ్యుండి పోటీ చేశారని , ఆమెపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేశారు. శ్రీదేవి కులంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయని తెలిపారు. ఎస్సీ కానీ శ్రీదేవిని అనర్హురాలుగా ప్రకటించాలని మాజీమంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. బాధితుల కోసం తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి స్వలాభం కోసం వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వుడు స్థానాలు ఎస్సీలకే కేటాయించాలని కేఎస్ జవహర్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో అవసరమైతే తాము కూడా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.ఇక ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజల కోసం చేసిన చట్టాలను సొంతానికి వాడుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.