బెజవాడోళ్లు ఎవరి రుణం ఉంచుకోరు: ఈ సారి సింగిల్గా మాచర్లకు వస్తా: బోండా ఉమా సవాల్..!
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్నలపై దాడి చోటు చేసుకున్న తరువాత అటు కృష్ణా, ఇటు గుంటూరు జిల్లాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత హీటెక్కాయి కృష్ణా, గుంటూరు జిల్లాలు. గుంటూరు జిల్లాలో అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి నెలకొనడం.. టీడీపీని మరింత అసహనానికి గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది.
బెజవాడోళ్లు ఎవరి రుణం ఉంచుకోరంటూ..
ఇలాంటి వాతావరణంలో తాను మరోసారి పల్నాడు ప్రాంతానికి వెళ్తానని ప్రకటించారు బోండా ఉమామహేశ్వర రావు. ఈ సారి సింగిల్గా వెళ్తానని, దమ్ముంటే తన పర్యటనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇద్దరు నాయకులపై 200 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడం కాదని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తనను అడ్డుకోవాలని అన్నారు. బెజవాడోళ్లు ఎవరి రుణం ఉంచుకోరని.. ఎవరి రుణాన్ని వారికి తీర్చేయడానికే తాను మాచర్లకు వెళ్తానని చెప్పారు.
రెచ్చగొట్టడానికే: పిన్నెల్లి
Recommended Video
ఎన్నికల సమయంలోనూ ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో పార్టీపరంగా విధ్వేషాలను రెచ్చగొట్టడానికే బోండా ఉమా సవాల్ విసురుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శిస్తున్నారు. తమను రెచ్చగొట్టి, శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాచర్లకే కాదు.. మొత్తం పల్నాడు ప్రాంతంలో బోండా ఉమా పర్యటించినా తమకు అభ్యంతరం లేదని, ఘర్షణలు సృష్టించాలనే కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని చెబుతున్నారు.