'సింహం లాంటోన్ని జీరో చేస్తున్నారు.. టీడీపీ మిత్రులు టూ డేంజర్'
పార్టీ పదవులు తీసుకున్నవారు విజిటింగ్ కార్డులు ముద్రించుకుని అమరావతిలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారని అన్నారు.
గుంటూరు: వందమంది శత్రువుల కన్నా.. ఒక్క వెన్నుపోటు పొడిచే మిత్రుడితోనే అత్యంత ప్రమాదమనేది నానుడి. సరిగ్గా తన విషయంలోను ఇలాగే జరుగుతోందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో సింహంలా పనిచేసిన తనను అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నవారే జీరో చేయాలని చూస్తున్నారని మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఉన్న శత్రువుల కన్నా.. టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
గుంటూరులో జరిగిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మోదుగుల ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువైపోయిందని, దీనివల్ల పార్టీ పదవులు, పనులు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయని అన్నారు.
పార్టీ కార్యకర్తల కోసం, పేదల కోసం ఏవైనా సిఫారసులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయినా.. నగరపాలక సంస్థ ఎన్నికలు మాత్రం జరగలేదన్నారు. వక్ఫ్ బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు.