ఎంపీ కింజరాపుతో విబేధాలపై నారా లోకేష్ ఏం చెబుతున్నారు?: పేటీఎం బ్యాచ్కు సానుభూతి అంటూ
అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు నియమితులు అయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న నారా లోకేష్ను కాదని కింజరాపు కుటుంబం చేతికి పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలను అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంలో నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడి మధ్య విభేదాలు తలెత్తాయని ఆ ఇద్దరు నేతల మధ్య ఇన్నిరోజుల పాటు కొనసాగిన సత్సంబంధాలు తెగిపోయాయంటూ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతున్నాయి. దీనిపై నారా లోకేష్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య సోదర భావం ఉందని స్పష్టం చేశారు. తామిద్దరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడితో తనకు చాలాకాలం నుంచి పరిచయం ఉందని అన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న తమ మధ్య గొడవలు పెట్టడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కుట్ర పన్నుతోందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఆయన పేటిఎం బ్యాచ్గా అభివర్ణించారు. రామ్మోహన్ నాయుడితో తనకు ఉన్న సత్సంబంధాలను తెంచడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారికి సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Recommended Video
తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా అధ్యక్షుడేనని నారా లోకేష్ అన్నారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కూడా అహర్నిశలు శ్రమిస్తారని, అధ్యక్షుడి తరమాలో పని చేస్తారని చెప్పారు. తనకు, రామ్మోహన్ నాయుడి మధ్య గొడవలు పెట్టడానికి పేటీఎం బ్యాచ్ చేస్తోన్న ప్రయత్నాలు తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చురకలు అంటించారు. వారి ప్రయత్నం వృధా అవుతుందని, ఎవరూ పట్టించుకోరని అన్నారు.