జంప్ జిలానీల విషయంలో టీడీపీ కొత్త స్ట్రాటజీ ... ఆ విషయంలో వ్యూహాత్మకంగా తెలుగు తమ్ముళ్ళు
తెలుగుదేశం పార్టీని పార్టీని వీడి వెళ్లే నేతల సంక్షోభం వెంటాడుతోంది. పార్టీని వీడుతున్న నేతలు అటు చంద్రబాబు నాయుడుని,ఇటు లోకేష్ ను,మరికొందరు కీలక నాయకులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తూ పార్టీని వీడి వెళుతుండటం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పార్టీ వీడే నేతలపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
టీడీపీని వీడి వెళ్ళే నేతల టార్గెట్ చినబాబేనా !! లోకేష్ టార్గెట్ వెనుక పెద్ద కథే !!
టీడీపీని కుదిపేస్తున్న నేతల వలసలు
తెలుగుదేశం పార్టీలో ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని రెండుసార్లు ఆలోచనను విరమించుకోవాలని, వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖలు రాసినప్పటికీ, వంశీని బుజ్జగించడానికి టిడిపి నేతలు ప్రయత్నం చేసినప్పటికీ వల్లభనేని వంశీ మోహన్ టిడిపిలో కొనసాగడానికి ససేమిరా అన్నారు.
చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేసిన వంశీ
అంతటితో ఊరుకోక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై నోటికొచ్చినట్టు మాట్లాడారు. భరించలేనంత పరుష పదజాలంతో దూషించారు. ఇక ఆ తర్వాత వైసీపి కి జై కొట్టిన వంశీ మోహన్ త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత టీడీపీలో యువనేత గా ఉన్న దేవినేని అవినాష్ పార్టీ మారడానికి నాలుగు రోజుల ముందు తన ఇంట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న యువ నేతలను అందరిని పిలిచి విందు ఏర్పాటు చేశాడు.
దేవినేని అవినాష్ విందు ఇచ్చి మరీ పార్టీ మార్పు
ఇక ఈ విందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం హాజరయ్యారు. టిడిపిలోనే కొనసాగుతానని చెప్పిన దేవినేని అవినాష్ నాలుగు రోజుల్లో మాట మార్చాడు. టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకున్నాడు. ఇక ఆ తరువాత టిడిపి వల్ల తనకు నష్టం జరిగిందని ఆయన మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
టీడీపీని వీడి వెళ్లాలనుకునే వారికి బుజ్జగింపు పర్వాలకు స్వస్తి
ఇక ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లాలనుకునే నేతలను బతిమిలాడాలనే, బుజ్జగించాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది టిడిపి అధినాయకత్వం.తెలుగుదేశం పార్టీ నాటి నుండి నేటి వరకూ ఎన్నో సంక్షోభాలను చూసిందని, ఇక ఇప్పుడు కూడా అటువంటి సంక్షోభాన్ని చూస్తుందని, అంతమాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, పార్టీ కోసం పని చేసే నాయకులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నారని భావిస్తున్న టిడిపి అధినాయకత్వం పార్టీ వీడిని వెళ్లే నేతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా వ్యూహం
పార్టీ ని ఎవరు వీడి వెళ్లిన దానికోసం బాధపడాల్సిన అవసరం లేదని, పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగా గత ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించిన నేపథ్యంలో, ఇప్పుడు తాజాగా గ్రామ,మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసుకొని పార్టీలో వలసలను ప్రోత్సహిస్తూ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని అధికార పార్టీ వైసిపి, బిజెపి ప్రయత్నం చేస్తున్నాయని భావిస్తుంది టీడీపీ అధినాయకత్వం.
Recommended Video
పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి ... జంప్ జిలానీల విషయంలో స్ట్రాటజీ
అంతమాత్రాన ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పార్టీని వీడుతున్న నేతల గురించి పట్టించుకోవద్దని తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలకు, శ్రేణులకు చెబుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటేలా ప్రతి ఒక్క కార్యకర్త చురుకుగా పాల్గొనాలని టీడీపీ అధినాయకత్వం దిశా నిర్దేశం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ పార్టీలో వలసలు కొనసాగుతున్న సందర్భంలో టీడీపీని వీడి వెళ్ళేవారికి ఇక నుండి కొత్త ట్రీట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎవరు పార్టీ వీడి వెళ్ళినా వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది.