అవిశ్వాసానికి టిడిపి నోటీస్: బాబు యూటర్న్, జగన్పై అనుమానాలు ఇవీ..
Recommended Video
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే మనసు మార్చుకున్నారు. ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి బదులు సొంతంగానే అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు నేతృత్వంలోని పోలిట్బ్యూరో నిర్ణయం మేరకు టిడిపి పార్లమెంటు సభ్యుడు తోట నర్సింహం శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు శుక్రవారం ఉదయం నోటీసు ఇచ్చారు. దీంతో ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జగన్పై టిడిపి వాదన ఇలా...
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ బిజెపికి దగ్గర కావాలని అనుకుంటున్నారని, అవిశ్వాస తీర్మానంపై జగన్కు చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన స్థితిలో వైసిపి సభ్యుడు విజయసాయి రెడ్డి పిఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని తోట నరసింహంం అన్నారు. స్వలాభం కోసం బిజెపికి దగ్గర కావడానికి అవిశ్వాసాన్ని జగన్ వాడుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు.
అయితే, ఇదీ కారణం...
వైసిపి ప్రతిపాదించిన అవిశ్వాసానికి తాము మద్దతు ఇస్తే ఆ క్రెడిట్ జగన్ వెళ్తుందనే అభిప్రాయం చంద్రబాబుకు కలిగినట్లు చెబుతున్నారు. దానివల్ల తమ పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన భావించినట్లు చెబుతున్నారు. అయితే దానికి టిడిపి కారణం వెతుక్కుని వెనక్కి తగ్గింది. వైసిపి ట్రాప్లో తాము పడదలుచుకోలేదని తోట నరసింహం అన్నారు.
అందుకే రాత్రికి రాత్రి నిర్ణయం
వైసిపి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం వల్ల తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయని భావించిన చంద్రబాబు తేరుకుని శుక్రవారం ఉదయమే తన రాజకీయ చాతుర్యానికి పదును పెట్టారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పోలిట్బ్యూరో సభ్యులతో అత్యవసరంగా మాట్లాడి ఎన్డీఎ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆర్థిక నేరస్థుడు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతు ఇస్తామని చంద్రబాబు అన్నారు.
ఎన్డీె పక్షాలకు ఇలా..
తాము ఎన్డీఎ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూటమి భాగస్వామ్య పక్షాలకు వివరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసిపి అధినేత జగన్లను ప్రోత్సహిస్తూ టిడిపిని దెబ్బ తీయాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో వైసిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం వల్ల తమకు నష్టం జరుగుతుందని, జగన్ ప్రతిష్ట పెరుగుతుందని ఆయన భావంచినట్లు చెబుతున్నారు.