మంచి పాలన తెచ్చేవారితోనే వచ్చే ఎన్నికల్లో పొత్తు: సోము వీర్రాజు
విజయవాడ: తమ అవినీతిని, అసమర్ధతను కప్పి పుచ్చుకొనేందుకే టిడిపి నేతలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన టిడిపి పాలనను అంతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను టిడిపి నేతలు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే టిడిపి నేతలు బిజెపిపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి విజయం తథ్యమన్నారు. ప్రత్యేక హోదా అని డిమాండ్ చేసినవారిపై కేసులు పెట్టిన చంద్రబాబునాయుడు ఇవాలళ మాట మార్చారని సోము వీర్రాజు మండిపడ్డారు.
రాష్ట్రంలో మంచి పాలన లేదన్నారు. రాష్ట్రంలో మంచిపాలన తెచ్చేవారితో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. బాబు అసమర్ధ పాలన కారణంగానే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
సాధారణ పౌరుడి నోట్లోకి రెండు పూటలా ఐదువేళ్లు వెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిలో కూరుకు పోయిన టీడీపీ పరిపాలనను అంతం చేస్తామని, మంచి పరిపాలన వచ్చేలా రూలింగ్ చేస్తామని సోము వీర్రాజు అన్నారు.