గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్
పులివెందుల: వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే అని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పిన జగన్.... వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రదాగుందన్నారు. హత్యకు పాల్పడింది ఒకరు కాదని చెప్పిన జగన్... హత్యకు చాలామంది సహకరించారన్నారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఒక మాజీ ఎంపీ ఒంటరిగా ఉన్నప్పుడు అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి గొడ్డలితో దాడి చేయడమనేది అతి కిరాతకమైన చర్యగా జగన్ అభివర్ణించారు. వివేకాను గొడ్డలితో ఐదుసార్లు నరికారని జగన్ చెప్పారు.
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..
బెడ్రూంలోనే హత్య చేసి కథ అల్లే ప్రయత్నం చేశారు
ఇక హత్య ఎలా జరిగి ఉంటుందో జగన్ చెప్పారు. బెడ్రూంలోనే తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్యచేసి ఆ తర్వాత కట్టుకథ అల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బెడ్రూంలో వివేకాను హత్యచేసి రక్తం కక్కుకుని మృతి చెందారని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని జగన్ చెప్పారు. అయితే ఇది నమ్మాలంటే బాత్రూంలోని కమోడ్కు రక్తం పూసి స్ఫృహ తప్పి చనిపోయాడని చెప్పేందుకు తపన పడ్డారని జగన్ చెప్పారు. అంతేకాదు వివేకానంద రెడ్డి ఒక లేఖ రాశాడని ఆ లేఖను పోలీసులు తనకు చూపించినట్లు జగన్ చెప్పారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న వ్యక్తి వీళ్ల సమక్షంలో లేఖ ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. దుండగులు హత్య చేసి ఆ నెపాన్ని డ్రైవర్ పైకి నెట్టివేసే ప్రయత్నం చేశారని జగన్ మండిపడ్డారు.
సీబీఐ విచారణకు డిమాండ్
తన చిన్నాన్న హత్యకు గురికావడంతో ఏపీ ప్రభుత్వం సిట్ వేసిందని చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని చెప్పిన జగన్... ఈ కేసును సీబీఐతో విచారణ చేపిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇక ఎస్పీతో తాను మాట్లాడుతున్న సమయంలోనే అడిషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ నుంచి మూడు సార్లు ఫోన్లు వచ్చాయని ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం ఉందని జగన్ అన్నారు.
మూడు కేసుల్లోను చంద్రబాబు పాత్రే కనిపిస్తోంది
ఇక 1998లో తన తాత రాజారెడ్డిని హత్య చేసిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని... తన తాత మృతితో వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప రాజకీయాలకే పరిమితమవుతారని భావించి నాడు హత్యచేయించారని ఆరోపించారు జగన్. ఇక హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తండ్రి వైయస్ మృతికి రెండు రోజుల ముందు "మీరు ఫినిష్" అవుతారు అని చంద్రబాబు హెచ్చరించారని గుర్తు చేసిన జగన్... తనపై దాడి కూడా చంద్రబాబే చేయించారని నిప్పులు చెరిగారు. తాజాగా తన చిన్నాన్న హత్య విషయంలో కూడా చంద్రబాబు హస్తం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పిన జగన్ తన తాత దగ్గర నుంచి తన చిన్నాన్న హత్య వరకు కామన్గా చంద్రబాబు కనిపిస్తున్నారని అన్నారు. వైయస్ వివేకానంద హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే అని చెప్పిన జగన్...వైసీపీ కార్యకర్తలను వైయస్ అభిమానులను సంయమనం పాటించాలని కోరారు.