ప్రభుత్వం నా భర్తపై కక్ష సాధిస్తోంది: పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ భార్య..
ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో.. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు రవికిరణ్ భార్య సుజన ఆయన్ను జైల్లో కలిశారు.
విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ను ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో.. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు రవికిరణ్ భార్య సుజన ఆయన్ను జైల్లో కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుజన.. టీడీపీ ప్రభుత్వం కావాలనే తన భర్తను ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండానే.. రవికిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ తర్వాత తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పోలీసులు రవికిరణ్ ను వదిలిపెట్టారు. ఈ దఫా బలమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో రవికిరణ్ కు ఈ నెల 23వరకు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 26న రవికిరణ్ కు నోటీసులు పంపించగా.. మే 9న ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన్ను విచారించిన పోలీసులు.. ఆపై అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.