రామ్ చరణ్ సంస్థకు.. నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
అమరావతి : డిమాండ్ లేనిచోట సౌకర్యాల కల్పన అంటే.. ప్రభుత్వ ఖజానాపై భారం పడే వ్యవహారమే. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న టర్బో మెఘా ఎయిర్ వేస్ కు తాజాగా రూ.4.90 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.
ప్రయాణికులు ఉన్నా లేకున్నా.. విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులు నడపాలన్న ఒప్పందం మేరకు ఈ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఇందుకోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని ప్రకటించింది. ప్రయాణికుల తాకిడి లేనిచోట విమాన సంస్థకు నష్టాలే మిగిలే అవకాశం ఉండడంతో.. నష్టాలను భరించి సైతం విమాన సర్వీసులను నడిపిస్తోంది ప్రభుత్వం.
విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప మధ్య ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ టెండర్ ను హీరో రామ్ చరణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న ట్రూ జెట్కు చెందిన టర్బో మెఘా ఎయిర్ వేస్ దక్కించుకుంది. ట్రూ జెట్ నడుపుతోన్న ఏటీఆర్-72 సర్వీసులు 72 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
వారంలో నాలుగు రోజులు ప్రయాణికులు లేకుండానే.. సర్వీసులు నడపడమంటే.. ఆర్థికంగా నష్టాలను మిగిల్చే వ్యవహారం కాబట్టి.. ప్రతీ విమాన సర్వీసులో ఐదు సీట్లను ప్రభుత్వానికి కేటాయిస్తూ ట్రూ జెట్ ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఏటా 672 సర్వీసులు నడిపిందుకు గాను ప్రభుత్వం ట్రూ జెట్ సంస్థకు రూ.9.76కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆరు నెలల సర్వీసులకు సంబంధించి రూ.4.90 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.