టిడిపికి గ్రూప్ రాజకీయాల సెగ... తాడిపత్రిలో వర్గాల పోరుతో ఉద్రిక్తం
అనంతపురం: తాడిపత్రి టీడీపీలో వర్గాల పోరు తారాస్థాయికి చేరింది. అక్కడ పార్టీ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని గ్రూపులు కలసి ఏకమై ఒకే గ్రూపుగా ఏర్పడినట్లు తెలుస్తోంది.
దీంతో ఎమ్మెల్యే వర్గం అంతా ఒక గ్రూప్ కాగా ఆయన వ్యతిరేకులంతా మరో గ్రూప్ గా ఏర్పడి తమ ఆధిపత్య నిరూపణకు పూనుకుంటుండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటైన పాత కూటమి నేతలంతా వచ్చే ఎన్నికలను టార్గెట్గా చేసుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం.
స్థలం వివాదం...కారణం...
ఈ క్రమంలోనే గురువారం తాడిపత్రి పట్టణంలో ఈ రెండు వర్గాల కారణంగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తత దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. స్థానిక బండా మసీదు వెనుక టీడీపీ నాయకుడు ఫయాజ్బాషా ఆధీనంలో ఉన్న స్థలం ఈ రెండు గ్రూపుల మధ్య వివాదానికి కారణం అయింది. ఈ స్థలాన్ని అదే పార్టీలోని మున్సిపల్ వైస్ చైర్మన్ జిలాన్ బాషా అధికారుల ద్వారా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో రగడ మొదలైంది.
పోలీసు స్టేషన్ వద్ద...ఆందోళన...
ఈ విషయమై వీరిద్దరూ వ్యక్తిగత విమర్శలకు దిగడంతో...టీడీపీలోని మరో వర్గం వారు తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వీరిపై పాంప్లెట్లు ముద్రించి పట్టణంలో పంచారు. దీనిపై మున్సిపల్ వైస్చైర్మన్ జిలాన్బాషా స్థానిక సీఐకి ఫిర్యాదు చేయగా, దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఫయాజ్బాషా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులకు మద్దతుగా స్థానిక టీడీపీ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, మరి కొంతమందితో కలసి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తాడిపత్రిలో...ఉద్రిక్తత
ఈ క్రమంలో జగదీశ్వరరెడ్డి తన ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి కూడా ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు స్పందించి ఆయన శరీరంపై నీళ్లు పోసి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల అదుపులో ఉన్న ఇద్దర్ని వదలకపోవడంతో ఆయన మరోసారి ఒంటిపై పెట్రోలు పోసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వ్యతిరేకులంతా...ఏకమయ్యారు...
తాడిపత్రి పట్టణంలో ఇప్పుడు ఉద్రిక్తతకు కారణం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయుల ఆందోళన కారణంగానే కావడం గమనార్హం. ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్రెడ్డికి గెలుపుకు కృషిచేసిన తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో ఫయాజ్ భాషా, ముందే ఎమ్మెల్యేకు దూరమైన స్థానిక కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, అతని సోదరుడు జగదీశ్వరరెడ్డి, జేసీ సోదరులకు అనుచరుడిగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా మారిన టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వీరంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిని దెబ్బతీయాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.