వ్రతం చెడ్డా ఫలితం దక్కుతోందని టీడీపీ ఖుషీ.. ఏపీ స్ధానిక పోరులో చిత్రాలు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికలకు ముందు 9 నెలలుగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీడీపీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసింది. ఓ దశలో ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చూపిస్తామని వైసీపీ సర్కారుకు సవాళ్లు కూడా విసిరింది. అయితే స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతోనే వైసీపీ చెలరేగిపోతోంది. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీకి వలసలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన టీడీపీ తాజాగా వైసీపీ దాడులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మాత్రం సక్సెక్ అయినట్లే కనిపిస్తోంది.
స్ధానిక పోరుకు ముందు...
ఏపీలో గతేడాది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విపక్ష టీడీపీ అసెంబ్లీ ఎన్నికల నాటి దారుణ పరాజయ భారంతో కుమిలిపోయింది. ఆ పార్టీకి అసెంబ్లీలో కేవలం 23 మంది సభ్యులే ఉండటం, అందులోనూ గంటా శ్రీనివాస్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు తరచుగా సమావేశాలకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో టీడీపీ పరిస్ధితి దారుణంగా తయారైంది.
అటు స్ధానికంగానూ పలు చోట్ల వైసీపీ నేతలతో పాటు అక్రమాల వెలికితీత పేరుతో అధికారులు కూడా టార్గెట్ చేయడంతో నియోజకవర్గాల్లో టీడీపీకి కక్కలేని మింగలేని పరిస్దితి వచ్చేసింది. అదే సమయంలో మూడు రాజధానుల ప్రకటన రావడంతో టీడీపీ దీన్నో అవకాశంగా మార్చుకోవడం ప్రారంభించింది. జిల్లాల్లో పరిస్ధితులు ఎలా ఉన్నా.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని వైసీపీకి సవాళ్లు విసరడం మొదలుపెట్టారు.
తీరా ఎన్నికలు వచ్చేసరికి..
స్ధానిక పోరుకు ముందు ఎన్నికలు పెడితే సత్తా చూపిస్తామని సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు.. నోటిఫికేషన్ వచ్చే సరికి సైలెంట్ అయిపోయారు. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా, పత్రికలతో పాటు అంతా స్ధానిక పోరులో పోటీ చేయకపోవడమే మంచిదని చంద్రబాబుకు సూచించడం మొదలుపెట్టేశాయి. దీంతో సహజంగానే ఆత్మరక్షణలో పడిన టీడీపీని పల్నాడులో భీకర దాడులతో వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైసీపీ చేస్తున్న దురాగతాలను అడ్డుకోలేక, అలాగని పోటీకి దూరంగా ఉండలేక టీడీపీ సతమతమైపోతోంది.
వైసీపీ దాడులు హైలెట్ కావడంతో..
పల్నాడుతో పాటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో కనీసం నామినేషన్లు కూడా వేయకుండా టీడీపీ అభ్యర్ధులను వైసీపీ అడ్డుకుంటున్న తీరు, దాడులు, బెదిరింపులను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటున్న టీడీపీ.. తన అనుకూల మీడియా ద్వారా వాటిని ప్రజల్లోకి పంపుతోంది. అదే సమయంలో హైకోర్టులో కేసులు వేయడంతో పాటు ఎన్నికల సంఘాన్ని సైతం కార్నర్ చేస్తోంది. దీంతో వైసీపీ సైతం వీటిపై వివరణలు ఇచ్చుకోవడం ప్రారంభించింది.
Recommended Video
వ్రతం చెడ్డా ఫలితం దక్కుతోందా?
ఏపీలో స్ధానిక పోరులో తాము గెలుస్తామని టీడీపీ ఎన్నడూ ఊహించలేదు. ఎన్నికల వాతావరణం చూస్తే టీడీపీ గెలుపుపై ఎవరికైనా అంచనాలు ఉంటే అవి కూడా ఆవిరైపోయాయి. అలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి గెలుపుకు దూరం చేస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటైన వైసీపీ నేతల దాడులు హైలెట్ అవుతుండటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కిన తీరుగా వైసీపీ దాడుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తమ ఓటమికి ఓ బలమైన కారణాన్ని టీడీపీ అప్పుడే రెడీ చేసేసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఇది కచ్చితంగా వైసీపీకి మైనస్ అయ్యే అంశమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.