మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతారా: రఘువీరాకు సిఎం సవాల్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతారా అని ఆయన అడిగారు.
రఘువీరా రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెసు సభ్యులు పార్లమెంటులో ప్రభుత్వం తెచ్చే ప్రతి బిల్లును అడ్డుకునేలా చూడాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లుకు మద్దతు ఇస్తామని, దానికి అనుకూలంగా ఓటేస్తామని ఆయన చెప్పారు. ప్రజల తీర్పు చూసిన తర్వాత పాపాలు కడుక్కోవడానికి కాంగ్రెసు ఈ బిల్లుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.
రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెసు ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిందని, దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదని తోట నరసింహం అన్నారు. తాము రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును సవరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా గురించి తాము చాలా సార్లు పార్లమెంటులో ప్రస్తావించామని ఆయన చెప్పారు.
హోదాపై తాము రూల్ 193 కింద స్పీకర్కు నోటీసు కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు బిల్లు ప్రతిపాదించినా తాము మద్దతిస్తామని, కాంగ్రెసు ఎన్ని పాపాలు చేసినా సరే తాము ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లుకు తమ సభ్యులు రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తారని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు చంపేసి సంతాప సభ పెట్టినట్లుగా ఉందని సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. విభజన విషయంలో అన్ని హామీలు అమలు చేయాలని తాము అడిగామని, ఆ సమయంలో జైరాం రమేష్ సహా కాంగ్రెసు సభ్యులంతా సభ నుంచి వెళ్లిపోయారని, అప్పుడు వారు ఉండి ఉంటే కెవిపి బిల్లు ఆమోదం పొంది ఉండేదని ఆయన అన్నారు. దాన్ని బట్టి కాంగ్రెసుకు ఎపి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబుపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కలిసి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు.