టీడీపీకి రాజకీయ విలువలు లేవన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీకి రాజకీయ విలువలు లేవని విమర్శలు గుప్పించారు.ఏపీలో విపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న నేపధ్యంలో టీడీపీని వెనక్కినెట్టి బీజేపీ బలోపేతం కావాలని ప్రయత్నం సాగిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో బలోపేతం కావాలన్న బీజేపీ ప్రణాళిక నేపధ్యంలో చంద్రబాబుపై విమర్శల తీవ్రత పెంచారు ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.
అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై మాటల యుద్ధంలో మరింత పదును పెంచారు . రాజకీయ విలువలు లేని టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీడీపీకి శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారని ఆయన తెలిపారు. చంద్రబాబు బీజేపీతో స్నేహం చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ అందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు.
అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో చంద్రబాబు ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు కన్నా లక్ష్మీ నారాయణ. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.ఇటీవల చంద్రబాబు బీజేపీ తో వైరం వల్లే టీడీపీ ఓటమి పాలైందని చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో చంద్రబాబు తీరు అందితే జుట్టు అందక పోతే కాళ్ళు అన్న చందంగా ఉందని కన్నా పేర్కొన్నారు.ఇక బీజేపీ టీడీపీని శాస్వతంగా దూరం పెట్టినట్టే అని చెప్పారు.