ఇక చాలు, మొదటికే మోసం: పవన్పై ఆదేశాలు! జనసేనానిపై గంటా డౌట్
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎదురుదాడి చేయాలని టిడిపి నిర్ణయించింది. జనసేనాని చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. పవన్కు సరైన కౌంటర్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లో పవన్ మద్దతిచ్చారు. ఎన్నికలకు ముందు ఆయనను టీడీపీ రాజకీయపరంగా బద్దశత్రువులా చూస్తోంది.
చదవండి: వాడుకుంటున్నారు, అదే సవాల్: జగన్తో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పవన్ తరచూ చేస్తున్న ఆరోపణలను ఇప్పటివరకూ ఆచితూచి మాత్రమే స్పందిస్తున్న టీడీపీ ఇకపై తీవ్రంగా తిప్పికొట్టనుంది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా సాగడంతో పవన్ అప్పుడప్పుడు తీవ్ర ఆరోపణలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన విమర్శల తీవ్రత పెరగడంతో తగ్గేది లేదని నిర్ణయానికి వచ్చారు.
చదవండి: పవన్ కళ్యాణ్! దమ్ముందా: నారా లోకేష్, మరోసారి నోరు జారిన మంత్రి
ఇక ఉపేక్షించొద్దు, మొదటికే మోసం
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన టీడీపీ అధిష్టానం ఇకపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. వైసీపీపై ఏ స్థాయి విమర్శలు చేస్తున్నామో అదే స్థాయిలో జనసేనపై విరుచుకుపడాలని అధిష్ఠానం నేతలకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. పవన్ పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
గంటా శ్రీనివాస రావు ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్కు 25 ప్రశ్నలను సంధించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను పవన్ కళ్లతో చూడలేని పరిస్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనే గెలిపించాననే భ్రమలో ఉన్నారు
టీడీపీని గెలిపించింది తానే అనే భ్రమలో పవన్ అన్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని గంటా నిలదీశారు. రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్... ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను ప్రశ్నించలేకపోతున్నారన్నారు.
పవన్ పైన అనుమానం ఉంది
బీజేపీ మాటలనే పవన్ మాట్లాడుతున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన పత్రాలు కేంద్రం వద్దే పెండింగ్లో ఉన్నాయని, వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్కు లేదన్నారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ పత్తా లేకుండా పోయారన్నారు.