టిడిపిలో రగడ: టైం చూసి.. జగన్ అలా ఉపయోగించుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తోందని, తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తోందని, తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కొద్దికాలంలో జరిగిన పరిణామాలను తీసుకున్నా ఆ విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.
'లోకేష్ సీఎం కొడుకైతే గొప్పా, ముద్రగడపై బాబును మంత్రులే నిలదీశారు'
కొద్ది నెలల క్రితం టిడిపి పార్టీ సమావేశంలో పార్టీ వేదిక పైన లోకేష్, వేదిక కింద ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అంశం, తాజాగా మంత్రి రావెల కిషోర్ - జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య విభేదాల వరకు వైసిపి రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తోందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
రావెలతో సయోధ్య: వదలను కానీ.. జానీమూన్, మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
లోకేష్ - చినరాజప్ప ఇష్యూ
కొద్ది నెలల క్రితం నారా లోకేష్ పార్టీ వేదిక పైన, వేదిక కింద చినరాజప్ప ఉన్నారు. చినరాజప్ప మైక్ పట్టుకొని ఉండగా, లోకేష్ ఆయన వైపు చేయి చూపిస్తూ ఏదో చెబుతున్నట్లుగా ఉంది.
ఈ ఫోటో పైన వైసిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. చినరాజప్పకు లోకేష్ క్లాస్ పీకినట్లుగా తెలుస్తోందని వైసిపి ఆరోపించింది. మంత్రులతో లోకేష్కు ఏం సంబంధమని, ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై టిడిపి వివరణ ఇచ్చింది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అని తెలిపింది.
లోకేష్ ఖండన
తమది పార్టీ సమావేశమని, పార్టీ సమావేశంలో లోకేష్ తనకున్న పదవి హోదాలో వేదిక పైన కూర్చున్నారని, అలాగే చినరాజప్పను లోకేష్ తిట్టాడని చెప్పడం సరికాదని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. లోకేష్, చినరాజప్ప కూడా వైసిపి ఆరోపణలను ఖండించారు.
రావెల కిషోర్ బాబు
తాజాగా, మంత్రి రావెల, జానీమూన్ మధ్య వచ్చిన బేదాభిప్రాయాలను వైసిపి రాద్దాంతం చేస్తోందని మంత్రి పత్తిపాటి ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపిలో ఏం జరుగుతుందా అని వైసిపి గోతికాడ నక్కలా కాసుకొని కూర్చుందని ఎద్దేవా చేశారు.
ఏ కుటుంబంలోనైనా చిన్న చిన్న విభేదాలు సహజమని, అవి పరిష్కరించుకోలేనివి కావని, రావెల - జానీమూన్ మధ్య కూడా విభేదాలు అలాంటివేనని, ఇప్పుడు అవి సమసిపోయాయన్నారు.
పత్తిపాటి ఆగ్రహం
పార్టీలోని చిన్న సమస్యలను చూపించి వైసిపి కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని పత్తిపాటి తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్ - చినరాజప్పల సమస్యను తీసుకొని ఇరు కులాల మధ్య, ఇఫ్పుడు రావెల - జానీమూన్ విబేదాలతో కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని అభిప్రాయపడ్డారు.