అఖిలపక్షం.. రాత్రికి రాత్రే మారిన రాజకీయాలు: బాబు కీలక వ్యాఖ్యలు, నిన్నటి వరకు కేసులు పెట్టి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అఖిల పక్ష సమావేశానికి జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు దూరం ఉన్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు హాజరయ్యాయి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రతినిధులు హాజరయ్యారు.
Recommended Video
అమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు
అదే విధంగా ప్రభుత్వం తరఫున ఐదుగురు మంత్రులు హాజరయ్యారు. అఖిల పక్షానికి మూడు కీలక పార్టీలు దూరం జరగగా.. కాంగ్రెస్ పార్టీ హాజరవడం గమనార్హం. మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్ననాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబులు హాజరయ్యారు.
అందరి సూచనలతో నిర్ణయం
అందరి సూచనలతో తుది నిర్ణయం తీసుకునేందుకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేసే అవకాశముంది. అఖిల పక్ష సమావేశం నిర్ణయం నాలుగేళ్లు ఆలస్యమైందంటూ ఇఫ్పటికే వైసీపీ, జనసేలు విమర్శిస్తున్నాయి.
ఏ పార్టీ నుంచి ఎవరు అంటే
తెలుగుదేశం నుంచి వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్, కళా వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్, కొలనుకొండ శివాజీ, సీపీఎం నుంచి మధు, వై వెంకటేశ్వర రావు, సీపీఐ నుంచి రామకృష్ణ, ముప్పాల నాగేశ్వర రావులు హాజరయ్యారు. లోక్సత్తా నుంచి బాబ్జీ, భాను ప్రసాద్ వచ్చారు.
రాత్రికి రాత్రే రాజకీయాలు మార్పు
ఇది అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అని చంద్రబాబు అన్నారు. రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతున్నాయని చెప్పారు. భేటీకి ముందు రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు తమ అజెండా వివరిస్తామని, అందరు కలిసి ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు. హోదా కోసం తాము పోరాడితే గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కేసు పెట్టిందని, ఇప్పుడు ప్రభుత్వం పిలిచింది కాబట్టి వెళ్తున్నామని, టీడీపీ పిలిచి ఉంటే వెళ్లే వాళ్లం కాదన్నారు.
బీజేపీలో కొత్త కల్చర్
అంతకుముందు, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అఢిగితే ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తమను విమర్శించనంత వరకు ఏపీకి సంబంధించిన అంశంపైనే పోరాటం చేస్తామన్నారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమన్నారు. తమను టార్గెట్ చేసుకుంటే మోడీ, అమిత్ షాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందన్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై అసత్య ప్రచారం సాగుతోందని, గతంలో లేని విధంగా బీజేపీలో కొత్త కల్చర్ వచ్చిందన్నారు.
కుట్రలో భాగస్వామ్యం కాబోము
టీడీపీ కుట్రలో తాము భాగస్వామ్యం కాబోమని బీజేపీఎల్పీ బీజేఎల్పీ విష్ణు కుమార్ రాజు చెప్పారు. అధికార పక్షం తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే అఖిల పక్ష సమావేశం అన్నారు. ఏపీ హక్కుల కోసం కేంద్రంపై సమైక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, అందుకే చంద్రబాబు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం అఖిలపక్షం అంటే ఎందుకు కలిసి రావడం లేదని వైసీపీ, జనసేనలను ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారన్నారు. అయితే, ఇన్నాళ్లు బీజేపీకి మద్దతు పలికి, హోదా గురించి నాలుగు మాటలు మార్చి, నాలుగేళ్ల తర్వాత అఖిలపక్షం అంటే ఎలా అని జనసేన ప్రశ్నిస్తోంది.