కడపలో టీడీపీ క్లీన్ బౌల్డ్ : ఆ ఇద్దరే పార్టీకి పెద్ది దిక్కు: జగన్ పైన పోటీకి మిగిలింది ఒక్కరే...!
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఊహించని విధంగా టీడీపీ క్లీన్ బౌల్డ్ అయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ సీట్లతో పాటుగా కడప..రాజంపేట లోక్ సభ సీట్లను గెలిచింది. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఊహించని విధంగా పులివెందుల..జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ లు..ముఖ్యనేతలైన సతీష్ రెడ్డితో పాటుగా రామసుబ్బారెడ్డి సైతం వైసీపీలో చేరటం ఖాయమైంది. ఇదే సమయంలో మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది.
ఇక, పులివెందులో వైయస్ కుటుంబం పైన ఇప్పటి వరకు నాలుగు సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరుతుండటంతో..ఇక, అక్కడ ప్రత్యామ్నాయంగా ఒక్కరే టీడీపీకి కనిపిస్తున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీకి కడప జిల్లాలో ఇద్దరే పెద్దదిక్కుగా కనిపిస్తున్నారు. అయితే, రాజకీయంగా చిరకాలంగా ఉన్న శత్రుత్వాలను వీడి ఇప్పుడు వారిని వైసీపీలోకి ఆహ్వానించటం ద్వారా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
టీడీపీ కీలక నేతలు వైసీపీలోకి...
కడప జిల్లాలో 2019 ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మరింతగా టీడీపీని కలవర పెడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న సతీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఆయన 13వ తేదీన వైసీపీలో చేరనున్నారు. అదే విధంగా మాజీ మంత్రి...జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ రామసుబ్బారెడ్డి ఈ రోజు వైసీపీలో చేరుతున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను స్థానిక ఎన్నికలకు దూరమని ప్రకటించి టీడీపీని వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి
నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్కుమార్రెడ్డి పేరును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా లోనైనట్లు తెలుస్తుంది. వరదరాజుల రెడ్డి అనుచరవర్గంఈ ఎన్నికల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడినా మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్తియార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక, రాయచోటి లో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న పాలకొండ్రాయుడు..ఆయన తనయుడు ప్రసాద్ సైతం వైసీపీ బాట పట్టినట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరే ఇప్పుడు ఆధారం..
ఇక, కడప జిల్లాలో టీడీపీకి 2019 ఎన్నికల వరకు అన్నీ తామై వ్యవహరించిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి..రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీలో చేరారు.అరకొరగా ఉన్న నేతలు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చూస్తుండగానే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు మొదలైన సమయంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. దీంతో..ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీ గా ఉన్న బీటెక్ రవి టీడీపికి జిల్లాలో ఆధారమయ్యారు. ద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అరకొరగా మిగిలి ఉన్న టీడీపీ నేతలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడం లేదు. కొందరు రెండో శ్రేణి నేతలు సైతం ఈ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
Recommended Video
జగన్ పైన పోటీకి ఆయన ఒక్కరే...
ఇప్పటి వరకు వైయస్సార్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నుండి నాడు వైయస్..ఇప్పుడు జగన్ మీద వరుసగా నాలుగు సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి టీడీపీని వీడారు. ఆయన స్థానంలో ఇప్పుడు టీడీపీకి అక్కడ ఒక్క నేత మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక, జగన్ పైన పోటీ చేసే బాధ్యత టీడీపీ ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవిని పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ గా నియమించనున్నారు. జగన్ పైన టీడీపీ అభ్యర్ధి సైతం ఆయనే అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, జిల్లా మొత్తంగా స్థానిక ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..అందునా సమయం చూసి వైసీపీ దెబ్బ కొట్టటంతో ..స్థానిక ఎన్నికలకు టీడీపీకి కోలుకొనే సమయం కూడా లేకుండా చేసి..సొంత జిల్లాలో జగన్ పూర్తిగా పైచేయి సాధించారు.