చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరిన టీడీపీ: పవన్ తో నేరుగా చంద్రబాబు..! కొత్త బంధాలకు వేదికగా..!
ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న దీక్ష చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ లో 12 గంటల పాటు దీక్ష సాగనుంది. ఈ దీక్ష కోసం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను టీడీపీ నేతలు మద్దతు కోరారు. ఇక, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతిచ్చింది. ఇప్పుడు పవన్ కు నేరుగా చంద్రబాబు ఫోన్ చేసి మద్దతు కోరే అవకాశం ఉంది. ఇక, మిగిలిన పార్టీ నేతలతోనూ ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి..ప్రధాన ప్రతిపక్షంగా లీడ్ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, బీజేపీ తాము సంఘీభావం ప్రకటిస్తాం కానీ, టీడీపీకి మద్దతిచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెప్పింది. పవన్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.
చంద్రబాబు దీక్ష..కొత్త ట్విస్ట్ : పోలీసుల అనుమతి నిరాకరణ: చేసి తీరుతామంటున్న టీడీపీ..!
కన్నాను కలిసిన టీడీపీ నేతలు
టీడీపీ అధినేత.. మాజీ సీఎం చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరారు. కన్నా లక్ష్మీనారాయణను ఆలపాటి రాజా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని కన్నా చెప్పారు. ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపీనే అని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్మార్చ్కు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు..రెండు సార్లు పొత్తు పెట్టుకుని నష్టపోయామని పేర్కొన్నారు. భవిష్యత్లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పవన్ తో చంద్రబాబు మాట్లాడుతారంటూ
ఇక, ఇదే ఇసుక సమస్య మీద జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ సమయంలో పవన్ కళ్యాన్ నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు. దీంతో..చంద్రబాబు తమ పార్టీ నుండి ముగ్గురు మాజీ మంత్రులను పంపించాలని నిర్ణయించారు. ఆయన ఆదేశించిన ముగ్గురులో గంటా గైర్హాజరు కాగా..మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు..అయ్యన్న పాత్రుడు జనసేన నిరసనకు హాజరయ్యారు. అదే సమయంలో రాష్ట్రంలోప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో..ఇప్పుడు తన దీక్షకు సైతం చంద్రబాబు స్వయంగా పవన్ ను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.
ఇతర పార్టీల నేతలకూ ఆహ్వానం..
బీజేపీ..జనసేన మాత్రమే కాకుండా..ఇతర పార్టీలు కాంగ్రెస్..వామపక్షాల నేతలను సైతం తమ పార్టీ నేతల ద్వారా తన దీక్షకు ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పార్టీలను ఆహ్వానించాలని.. ఎవరు వచ్చినా..రాకున్నా.. దీక్ష కొనసాగిస్తామని..అయితే, ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీక్ష కోసం ప్రభుత్వం టీడీపీ నేతలు కోరిన మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వకపోవటంతో ధర్నా చౌక్ దగ్గర పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త బంధాలు బలపదే వేదికగా..
రాష్ట్రంలో సీనియర్ నేతగా.. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా తమ పార్టీలో ఉంటూ పార్టీని వీడాలనే నేతలకు..కేడర్ కు కొత్త జోష్ రావటంతో పాటుగా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని భావిస్తున్నారు. అయితే, బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు. పవన్ నేరుగా చంద్రబాబుకు మద్దతిస్తే బీజేపీ పవన్ తోనూ దూరంగానే ఉంటుంది. ఇక, వామపక్షాలు కొద్ది రోజుల క్రితం వరకు పవన్ తోనే ఉన్నాయి. చంద్రబాబు దీక్షకు వామపక్షాలు మద్దతిస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ వేదిక ద్వారా తమతో కలిసి పని చేసేది ఎవరు..దూరంగా ఉండేది ఎవరనేది నిర్ణయించుకోవాలని టీడీపీ భావిస్తోంది.