టీడిపి అక్షయ పాత్రలాంటి పార్టీ..! నాయకులను తయారుచేసే కార్మాగారమన్న రావుల..!!
హైదరాబాద్ : ఈనెల 20 నుండి అన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేవం పార్టీ అక్షయ పాత్ర లాంటిదని, నాయకులు వెళ్లి పోతున్నా, మళ్లీ పుడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన వన్ ఇండియాతొ ప్రత్యేకంగా మాట్లాడారు.
తెలంగాణలో అదికార టీఆర్ఎస్ పార్టీ పరి పాలనను మర్చిపోయిందని, అందుకే ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ప్రగతి భవన్ ను వదిలి బయటకు రావడం లేదని అన్నారు. టీడిపి కి చెందిని నేతలు బీజేపిలోకి వెళ్తున్న అంశాన్ని ప్రస్తావించగా తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్మాగారమని చెప్పుకొచ్చారు. ఎంత మంది నేతలు మారినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, మళ్లీ కొత్తగా నేతలు ఆవిర్బవిస్తుంటారని, అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు.ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడుతూనే పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
అందులో భాగంగా ఈ నెల 20 నుండి తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాల్లో సమావేవాలు నిర్వహించి కొత్త నాయకత్వాన్ని సిద్దం చేస్తామని తెలిపారు. సమావేశాల్లో ముఖ్యంగా పార్టీ బలోపేతం, సరైన నాయకత్వం లేని చోట నాయకులను నియమించడం, అదికార పార్టీ విధానలపై పోరాటాలను రూపొందించుకోవడం, ప్రజా సమస్యల పట్ల ఉద్యమించడం వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు పూర్తయిన తర్వాత జిల్లాల వ్యాప్తంగా పర్యటించి ఖాళీ ఐన పదవులను భర్తీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఖాళీ ఐపోయింది అని అంటున్న వారికి త్వరలో గుణపాఠం చెబుతామని, అదికార పార్టీకి సరైన సమాదానం చెప్పేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, పార్టీ పూర్వవైభవం సాదించడం కోసం అందరం ఐకమత్యంగా కృషి చేస్తామని రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.