బాలయ్య ఇక మారడా ? టీడీపీ సినిమా కష్టాల్లో ఉన్నా హిందూపురం ఎమ్మెల్యే సినిమాలు వదలడే !!
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక మారడా? టీడీపీ పూర్తిగా మునిగిపోయేదాకా అయన టీడీపీని పట్టించుకోడా? ఒకపక్క ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్తున్నా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చీమ కుట్టినట్టుగా లేదా ? అసలు ఆయన టీడీపీలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేనేనా ? అన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జరుగుతుంది.
బాలయ్య తీరుతో టీడీపీలో తీవ్ర అసంతృప్తి
యాక్టింగ్ లేదు ఓన్లీ పొలిటికల్ ఫైటింగ్ అని చెప్తారని ఆశగా ఎదురు చూసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు బాలకృష్ణ తీరుతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. చంద్రబాబు సాగించిన ఇసుక దీక్షలో సైతం బాలకృష్ణ భాగస్వామ్యం తీసుకోకపోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు మరింత కష్టాల ఊబిలో చిక్కుకుపోతుంది. టీడీపీలో బలమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్తున్నారు. అయినా బాలయ్య మాత్రం పార్టీ అధినేత, వియ్యంకుడు అయిన చంద్రబాబుకు బాసటగా నిలవటానికి ఏ మాత్రం ప్రయత్నం చెయ్యటం లేదు .
ఎవరికివారే యమునా తీరే అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యేలు
ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లో పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు గట్టిగా అధికార పార్టీతో తలపడాల్సిన చోట, అందరూ సమైక్యంగా పోరాటం చెయ్యాల్సిన చోట ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. చంద్రబాబు పార్టీ నేతలను అసంతృప్తి నుండి బయటకు తీసుకురావటంలో ఫెయిల్ అవుతున్నారు. ఇక లోకేష్ బాబు పరిస్థితి అంతంత మాత్రమే. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితిలో అయినా బాలకృష్ణ నేనున్నా అంటూ పార్టీని ముందుకు నడిపిస్తారు అంటే అదేం లేదు.
రాష్ట్రంలో టీడీపీ పుట్టి మునుగుతున్నా బాలకృష్ణ సినిమాల్లో బిజీ
ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఒకపక్క పార్టీ పుట్టి మునుగుతున్నా ఆయన మాత్రం తన పంధా మార్చుకోవటం లేదు . నిన్నటికి నిన్న ఇసుక దీక్ష చేసిన చంద్రబాబుకు బాసటగా నిలవాల్సిన చోట కూడా అయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ అయినా ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తే మళ్లీ పార్టీ క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నిండుతోందని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. రాయలసీమ పూర్తి బాధ్యతలను బాలకృష్ణ చేపట్టి రాయలసీమలో పార్టీని పటిష్టం చేయాలని టిడిపి నేతలు గత కొంతకాలంగా భావిస్తున్నా బాలయ్య మాత్రం బాధ్యతలు చేపట్టేలా కనిపించటం లేదు.
వల్లభనేని వంశీ,దేవినేని అవినాష్ .. పార్టీ వీడి పోతున్నా పట్టని బాలయ్య
కనీవినీ ఎరుగని ఓటమితో, ఎప్పుడు ఎవరు గోడ దూకుతారో ఆందోళనతో ఉన్న టీడీపీ ఇప్పుడు పీకల్లోతు సినిమా కష్టాల్లో ఉన్నా బాలకృష్ణ మాత్రం సినిమాలే ప్రపంచం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక తాజాగా దేవినేని అవినాష్ సైతం షాక్ ఇచ్చి వైసీపీ లో చేరారు. అయినా బాలయ్య ఇంతా జరుగుతున్నా స్టార్ట్.. కెమెరా..యాక్షన్ అనటం తెలుగు తమ్ముళ్ళకు నచ్చటం లేదు . పట్టించుకోవాల్సిన నేత నిర్లిప్త వైఖరి పార్టీ శ్రేణులను కుదేలు చేస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ కోసం గట్టిగా పనిచెయ్యని బాలకృష్ణ
2014లో హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య సినిమాలు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయినా సరే సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులను బట్టి సినిమాలను వదిలిపెట్టి బాలయ్య ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో టిడిపి నిలబడాలంటే ఇప్పటికైనా బాలయ్య రెండు పడవల మీద కాళ్లు పెట్టడం మానేయాలని,రాజకీయాల మీద దృష్టి సారించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. కానీ ఆ ఆశ అడియాశే అన్న భావన తెలుగు తమ్ముళ్లలో ప్రస్తుతం వ్యక్తం అవుతుంది.
.