ఏపీ అసెంబ్లీ: రూటు మార్చిన టీడీపీ: బలం లేని చోట బాయ్కాట్: మెజారిటీ ఉన్న చోట సత్తా చాటేలా
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని తొలుత నిర్ణయించుకున్న టీడీపీ.. అనంతరం రూటు మార్చింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అధికార పక్షం ప్రవేశపెట్టే ధన్మవాద తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనకూడదని నిర్ణయించింది. ధన్మవాద తీర్మానంపై చర్చను బహిష్కరించాలని తీర్మానించింది. శాసనసభలో బలం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనూ అభ్యంతరాలను లేవనెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై
గవర్నర్ ప్రసంగ పాఠంలో పొందుపరిచిన పలు అంశాలపై తమ నిరసనను తెలియజేస్తూ సభ నుంచి బయటికి వచ్చేలా టీడీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, తమ పార్టీ సభ్యులతో కలిసి సభను బాయ్కాట్ చేస్తున్నట్లు లేదా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి..బయటికి వస్తారని, అనంతరం ఇక మళ్లీ సభలో అడుగు పెట్టకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండోరోజు కూడా సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సభ్యులకు సూచించినట్లు చెబుతున్నారు.
బలం లేకపోవడం వల్లే
ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య 23. వారిలో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఫలితంగా- వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నారు. గుంటూరు పశ్చిమ సభ్యుడు మద్దాలి గిరిధర్ రావు పరిస్థితీ దాదాపుగా అంతే. ఫలితంగా- టీడీపీ సభ్యుల సంఖ్య 20కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కొనలేమనే ఉద్దేశంతో సభ నుంచి బయటికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బలం ఉన్న కౌన్సిల్లో
తెలుగుదేశం పార్టీకి పూర్తి బలం ఉన్న శాసన మండలిలో మాత్రం రెండురోజుల పాటు సభా కార్యకలాపాల్లో పాల్గొనబోతోంది టీడీపీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి వస్తోంది. తెలుగుదేశానికి 25 మంది సభ్యుల బలం ఉంది శాసన మండలిలో. అందుకే- వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టేలా సత్తా చాటాలని టీడీపీ నిర్ణయించింది. శాసనసభా పక్ష ఉపనేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై వైసీపీ విధానాలను ఎండగట్టేలా వ్యూహాన్ని రూపొందించుకున్నట్లు సమాచారం.
Recommended Video
యనమల సారథ్యంలో..
శాసన మండలిలో టీడీపీ సభా పక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలో ప్రతి ఒక్క సభ్యుడూ చర్చల్లో పాల్గొనేలా టీడీపీ పార్టీపరంగా నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ నేతల అరెస్టు వ్యవహారం, మూడు రాజధానుల ఏర్పాటును ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై సత్తా చాటాలని ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ్యులకు సూచనలను జారీ చేశారు. వికేంద్రీకరణ బిల్లును మరోసారి అడ్డుకోవాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా సభకు గైర్హాజర్ కావొద్దని ఆదేశించారు.