కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా టీడీపీ పబ్లిసిటీ చేస్తోంది: జీవీఎల్ నరసింహారావు
ఏపీ ప్రజలను అక్కడి రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఇప్పుటి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వమే నిధులు ఇస్తోందని సభకు రావు తెలియజేశారు. అక్కడ బాధ్యత కలిగిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు.
Recommended Video
ఏపీకి కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, అప్పటి కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడుకు, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలిలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. నరసింహారావు చెబుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరోజు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నేడు యూటర్న్ తీసుకోవడం ఏమిటని నరసింహారావు మండిపడ్డారు. హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా ఏముందని నాడు టీడీపీ ప్రశ్నించిందని... నరసింహారావు చెప్పారు. హోదా వల్ల ఏడాదికి కేవలం రూ.3500 కోట్లు మాత్రమే లబ్ధి జరుగుతుందని నాడు టీడీపీ ప్రభుత్వం చెప్పిందని అదే ప్యాకేజీతో ఎక్కువ లాభం జరుగుతుందని ప్రభుత్వం చెప్పినట్లు నరసింహారావు సభ దృష్టికి తీసుకొచ్చారు.
కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ మహానాడులో తీర్మానం
గతేడాది మేలో జరిగిన మహానాడులో ప్యాకేజీపై ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం కూడా చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది మేలో ఈ ఏడాది జనవరిలో చెప్పిన్న ప్రకారమే ఇప్పడు టీడీపీ ఎందుకు నడుచుకోవడంలేదని టీడీపీ ఎంపీలను నరసింహారావు ప్రశ్నించారు. నాడు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పడు స్పెషల్ స్టేటస్ అంటూ యూటర్న్ తీసుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి రాజకీయ లబ్ధి లేకపోతే ఏపీ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని రావు ధ్వజమెత్తారు. ఏపీలో ఏడు జిల్లాలకు పన్నురాయితీలు ఇస్తున్నట్లు సీబీడీటీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇండస్ట్రియల్ కారిడార్కు ఇప్పటి వరకు భూసేకరణ జరపని టీడీపీ
14వ ఆర్థిక సంఘం ఏపీకి రూ.2లక్షల 44వేల కోట్లు ఇచ్చిందని రావు చెప్పారు. అంతేకాదు రెవిన్యూ లోటు భర్తీ చేసేందుకు రూ. 22వేల కోట్లు ఆర్థిక సంఘం ఇచ్చిందని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే ఇంత ఎక్కువగా వచ్చేది కాదని చెప్పారు. ఇవన్నీ వాస్తవాలని సభ్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముందన్నారు నరసింహారావు. రాష్ట్రానికి కేంద్రం రెండు ఇండస్ట్రియల్ కారిడార్ను ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇక్కడ రాష్ట్రప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉందని... అది ఇప్పటి వరకు చేయలేదని చెప్పిన నరసింహారావు.. ఇది జరిగితే 2045 కల్లా 1కోటి 10 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక అని చెప్పారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మానుఫాక్చురింగ్ జోన్లను ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు కేటాయించిందని చెప్పిన నరసింహారావు.. 2015 నుంచి ఇప్పటి వరకు భూసేకరణ చేయలేదని చెప్పారు.
పోలవరం మోడీ ఇచ్చిన వరం
దుగ్గిరాజు పట్నం పోర్టు సాధ్యంకాదని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో పోర్టును వృద్ధి చేస్తామని చెప్పినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ఇక పోలవరం నిజంగా చెప్పాలంటే అది మోడీ వరం అని నరసింహారావు చెప్పారు. పోలవరంకు పూర్తిగా నిధులు కేంద్రం ఇస్తోందని గుర్తుచేశారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద 14 ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేస్తోందన్నారు. మరో 104 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.
కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలుగా పబ్లిసిటీ ఇస్తున్న టీడీపీ
ఏపీకి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నుంచి 7.42 లక్షల ఇళ్లను పేద ప్రజలకు మంజూరు చేసిందని ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత స్థాయిలో ఇళ్లు ఇవ్వలేదన్నారు. ఈ ఇళ్లను కట్టేందుకు కాంట్రాక్టర్లు చదరపు అడుగుకోసం రూ.3వేలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది పేదప్రజలకు వెళ్లడంలేదని కాంట్రాక్టర్లకు వెళుతోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ బాగా చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోందని నరసింహారావు ధ్వజమెత్తారు.
ఏపీపై కేంద్రప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి సారించిందని.. రాష్ట్రప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల పై దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై రుద్దే ప్రయత్నం టీడీపీ చేస్తోందని చెప్పారు.