టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విప్: మరి..ఆ నలుగురు మద్దతిస్తారా: చంద్రబాబు కొత్త వ్యూహం..!
ఏపీలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలను ఆచరణలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందు కోసం సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ మరుసటి రోజునే శాసన మండలిలోనూ ఆమోదం పొందాలనేది ప్రభుత్వం వ్యూహం. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సైతం ప్రతివ్యూహాలను సిద్దం చేస్తోంది. అందులో భాగంగా..తొలి సారిగా సభ్యులకు విప్ జారీ చేస్తోంది. పార్టీ నుండి దూరమై..అధికార పార్టీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని నిర్ణయించారు. ఇక..మండలిలో టీడీపీ కీలక భూమిక పోషించనుంది. దీని పైన పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు..ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
టీడీపీ నేతలకు ఐటి ఉచ్చు: ఇన్ సైడర్ ట్రేడింగ్ నేతలపై సీఐడి ఫిర్యాదు: సీబీఐకీ అప్పగిస్తారా..!
టీడీపీ సభ్యులకు విప్ జారీ..
మూడు రాజధానుల ప్రతిపాదన..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు పైన సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రభుత్వం అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు ను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. ఇక, సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్టీ శాసన సభ్యులతో పాటుగా ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వం సభలో సీఆర్డీఏ బిల్లు సవరణ..రద్దు.. మూడు రాజధానుల అంశం పైన తీర్మానం..వంటి వాటిల్లో ఏ రూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉందనే దాని పైన టీడీపీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఏ రూపంలో బిల్లు సభ ముందుకు వచ్చినా..ఏ రకంగా ఎదుర్కోవాలనేది దాని పైన వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా.. పార్టీ శాసన సభ్యులు..శాసనమండలి సభ్యులకు పార్టీ విప్ జారీ చేసింది.
ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలకు విప్..
పార్టీ నుండి గెలిచిన 23 మంది శాసన సభ్యులు తప్పని సరిగా అసెంబ్లీకి హాజరు కావాలంటూ టీడీపీ విప్ జారీ చేసింది. అందులో టీడీపీ నుండి దూరమై వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ..మద్దాలి గిరికి సైతం పార్టీ విప్ జారీ చేసింది. వారికి పార్టీ నుండి అధికారిక సమావేశం పంపారు. వారి వ్యక్తిగత మెయిల్ కు సందేశం..ఫోన్ కు మెసేజ్ తో పాటుగా వాట్సప్ సందేశం సైతం పంపుతున్నారు. వారిద్దరూ ఇప్పిటికీ అసెంబ్లీ రికార్డు ల ప్రకారం టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. టీడీపీ విప్ జారీ చేయటం ద్వారా..వీరిద్దరూ విప్ ఉల్లంఘిస్తే దానిని వారి మీద చర్యలు తీసుకొనే విధంగా టీడీపీ వ్యూహం సిద్దం చేస్తోంది. ఇక, సీఆర్డీఏ చట్టం సవరణ.. అమరావతికి చట్ట బద్దంగా ఉన్న హక్కులు.. ప్రభుత్వ ప్రతిపాదనల పైన న్యాయ పరంగా..సాంకేతికంగా ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని పైన న్యాయ నిపుణుల సలహాలను సైతం టీడీపీ సేకరిస్తోంది. శాసనసభలో తమకు బలం లేదని తెలిసినా..రాజధాని విషయంలో డివిజన్ కు పట్టుబట్టి..ఆ ఇద్దరు రెబల్స్ వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపైన చర్యలకు తమకు అవకాశం దక్కుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ నుండి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది కీలకంగా మారుతోంది.
మండలిలో టీడీపీ కీలకంగా..
ఇక, ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి సభ్యుల పాత్ర కీలకం కానుంది. ప్రభుత్వం ఏ రూపంలో మూడు రాజధానుల అంశం పైన శాసనసభ ముందుకు వచ్చినా..అనుకూలంగా ఫలితం సాధించేందుకు అధికార వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉంది. ఇక, శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదించే బిలు..లేదా తీర్మానం ఆమోదం పొందిన తరువాత మండలిలోనూ చర్చకు రానుంది. ఇందు కోసం 21వ తేదీన శాసన మండలి సమావేశానికి నోటిఫికేషన్ జారీ చేసారు. మండలిలో టీడీపీకి ప్రస్తుతం 28 మంది సభ్యుల మద్దతు ఉంది. అదే విధంగా బీజేపీ నుండి ఇద్దరు సభ్యులు ఉన్నారు. నామినేటెడ్ సభ్యుల్లోనూ కొందరు అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారు. దీంతో..అక్కడ తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా సభ్యులకు సూచనలు చేస్తున్నారు.