ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యుద్ధప్రాతిపదికన ప్రచారం మొదలుపెట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న వైసిపి, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టిడిపి ప్రచారం చేస్తోంది.
Recommended Video
ఎన్నికల ప్రచార పర్వంలోకి చంద్రబాబు
పార్టీ గుర్తు తో పోటీ చేసే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార బరిలోకి దిగనున్నారు. ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం నుండి ప్రచార పర్వంలోకి దిగబోతున్న చంద్రబాబు కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు ,విశాఖలో జరిగే రోడ్డు షో లలో పాల్గొనబోతున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు . అలాగే వైసీపీ అక్రమాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టనున్నారు .
టీడీపీ నేతల్లో జోష్ ... మున్సిపల్ ఎన్నికలే టార్గెట్
ఈ సారి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికలలో చాటాలని, ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు, టిడిపి సోషల్ మీడియా సైన్యానికి దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, వైసీపీ నేతల అక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. దూకుడుగా ప్రచారం నిర్వహించడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.
చంద్రబాబు ప్రచారంతో హీటెక్కనున్న మున్సిపోల్స్
అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని,బెదిరింపులకు గురి చేసిన ఎవరూ భయపడవద్దని, తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు చంద్రబాబు . కష్టపడి పోరాటం చేస్తే విజయం తప్పక లభిస్తుంది అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపోల్స్ లో సోషల్ మీడియా ప్రచారం బాగా పెరగాలని, ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక చంద్రబాబు కూడా ప్రచార బరిలోకి దిగనుండడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరినట్లుగా తెలుస్తుంది.