షర్మిల, విజయమ్మల్ని లాగుతావా? ఇది సీరియస్.. జోకులొద్దు: రాజేంద్రప్రసాద్పై సొంత పార్టీ నేత ఆగ్రహం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల కుట్ర ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీకి చెందిన జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.
జగన్పై దాడి మీద రివర్స్: 'రిమాండ్ రిపోర్ట్పై టీడీపీ ఏం చెబుతుంది, ఉలిక్కిపాటు ఎందుకు'
సీరియస్ అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని చెప్పారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. జగన్ మీద దాడిపై సొంత పార్టీ నేతనే తప్పుబట్టడం ఆ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు. ఇది సీరియస్ విషయమని, జోకులు వద్దన్నారు.
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్...
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్... వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి విషయంలో ఆయన నేరుగా వారి కుటుంబ సభ్యుల పైనే ఆరోపణలు చేయడం గమనార్హం. జగన్ కుటుంబంలో అనేక విభేదాలు ఉన్నాయని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను జగన్ రాజకీయంగా అణగదొక్కుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పైన ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. జగన్ను హత్య చేయడం ద్వారా సానుభూతితో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని షర్మిల, విజయమ్మలు కుట్ర చేసి ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఫోటో పెట్టుకొని ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ పైన కత్తి దాడి విజయమ్మ, షర్మిల పనే అని తమ అనుమానం అని వ్యాఖ్యానించారు. పార్టీలో తమను ఎదగనీయకపోవడంతో, జగన్ చనిపోతే పార్టీ పగ్గాలు తమ చేతికి వస్తాయని విజయమ్మ, షర్మిలల ఆలోచన కావొచ్చునని వ్యాఖ్యానించారు. దీని పైనే జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
మూడు వేల కిలోమీటర్లలో దాడులు జరిగాయా?
జగన్ పాదయాత్ర చేసిన మూడు వేల కిలోమీటర్లలో దాడులు జరిగాయా అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. దాడిపై జగన్ మీడియా ముందుకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగన్ పైన దాడి ఘటనను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
గంటలోపే సమాచారం ఎలా సేకరించారు?
తమ పార్టీ అధినేత జగన్ మీద దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. ఘటనకు బాధ్యత వహించవలసిన ఎయిర్ పోర్టు తమ పరిధిలో లేదని వారు చెబుతున్నారని, మరి సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటే నిందితుడు శ్రీనివాస రావు గురించి గంటలోపే డీజీపీ సమాచారం ఎలా సేకరించారని ప్రశ్నించారు.
పరామర్శించిన వారిని కూడా తప్పుబడతారా?
నిందితుడి సమాచారం సంఘటన జరగకముందే డీజీపీ వద్ద ఉందా అని పార్థసారథి నిలదీశారు. ప్రచారం కోసమే జగన్ పైన దాడి జరిగిందని డీజీపీ ఎలా తేల్చారని అడిగారు. సంఘటనను తగ్గించి చూపించేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పరామర్శించిన వారిని సైతం చంద్రబాబు తప్పుబట్టడం దారుణం అన్నారు.
ఇప్పటి వరకు పరామర్శించలేదు
గతంలో చంద్రబాబు నాయుడుపై దాడి జరిగినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి మానవత్వంతో స్పందించారని పార్థసారథి చెప్పారు. కానీ జగన్ పైన దాడిని చంద్రబాబు రాజకీయం చేయడంతో పాటు, ఇప్పటి వరకు పరామర్శించలేదని మండిపడ్డారు.