పవన్ కల్యాణ్ ఎఫెక్ట్: సబ్బం హరి కోసం టిడిపి ప్రయత్నాలు
హైదరాబాద్: విశాఖపట్నం నగరపాలక సంస్థపై ఓ వైపు బిజెపి, మరో వైపు పవన్ కల్యాణ్ జనసేన కన్ను వేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలమైన నేత కోసం ప్రయత్నాలు చేస్తోంది. వనగర పాల సంస్థల ఎన్నికల్లో బిజెపి తమతో కలిసి వస్తుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో బలమైన నేతగా పేరున్న సబ్బం హరిని పార్టీలో చేర్చుకోవడానికి టిడిపి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి కూడా సబ్బం హరిని తమ గూటికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరిని తమ గూటికి తెచ్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, గత పార్లమెంటు ఎన్నికల్లో సబ్బం హరి వైసిప నుంచి వైదొలగడం వల్ల విజయలక్ష్మి ఓటమి పాలయ్యారు, అదే సమయంలో సబ్బం హరికి విశాఖలో క్లీన్ ఇమేజ్ ఉంది. వివాద రహితుడిగా కూడా ఆయనకు పేరుంది. అటువంటి నాయకుడు తమ పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగు ఉండదని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
హరి మేయర్గా పనిచేసిన కాలం కన్నా ఇప్పుడు కార్పొరేషన్ పరిధి పెరిగింది, వెలమ సామాజికవర్గంలో పట్టు ఉండటంతో మేయర్ అభ్యర్ధిగా సబ్బం సరైన నాయకుడిగా అంచనా వేస్తోంది. అందులో భాగంగా ఆయనను తమ పార్టీలో చేరాలని సబ్బం హరి సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఇటీవలి విధానమండలి ఎన్నికల ముందు కూడా, పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారు, అయితే ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. సబ్బం హరి పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా ఉత్తరాంధ్రలో బలమైన వెలమ సామాజికవర్గం కూడా పార్టీ వైపు వస్తుందని టిడిపి అంచనా వేస్తున్నట్లు సమాచారం.
బిజెపి కూడా ఇదే అంచనాతో సబ్బం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సబ్బం హరితోపాటు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కూడా పార్టీలో చేర్చుకుంటే ఉత్తరాంధ్రలో వెలమ, గవర కులాలను ఆకట్టుకోవచ్చన్న యోచనతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి ప్రముఖులు ఆయన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం.
పార్టీ అధినేత అమిత్షా ఆదేశాల మేరకు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడంపై బిజెపి రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. పైగా విశాఖలో ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే బలం ఉన్నందున సబ్బం హరి కూడా చేరితే విశాఖ జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్న అంచనా ఉంది. టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది సబ్బం హరినే.