తిరుపతి రాజకీయంలో మరో టర్నింగ్- బీజేపీ దూకుడుతో మారిన సీన్-టీడీపీ కౌంటర్ ఎటాక్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలను మలుపుతిప్పే అవకాశం ఉన్న తిరుపతి ఉప ఎన్నికపై ఇప్పుడు పార్టీలన్నీ దృష్టిసారించాయి. పనబాక లక్ష్మిని అందరి కంటే ముందుగా అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా తిరుపతి పోరును ప్రారంభించిన టీడీపీని ఆ తర్వాత వైసీపీ ఫాలో కాక తప్పలేదు. అయితే మధ్యలో బీజేపీ దూకుడు రాజకీయాలతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో పరిస్ధితి మారుతుందని గ్రహించిన టీడీపీ ఇప్పుడు కౌంటర్ అటాక్ ప్రారంభించింది.
తిరుపతిలో వాడీవేడీగా రాజకీయం
తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికను నోటిఫై చేసి నాలుగు నెలలు పూర్తి కావడంతో మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఉపఎన్నిక కోసం అందరి కంటే ముందుగా టీడీపీ రంగంలోకి దిగింది. అభ్యర్ది ప్రకటనతో టీడీపీ తొలి అడుగు వేయగా.. అదే బాటలో వైసీపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో సాగుతున్న విగ్రహాల రాజకీయంతో బీజేపీ ఇక్కడ మూడో అడుగు వేసింది. ముఖ్యంగా తిరుపతి పోరు బైబిల్కూ, భవద్గీతకూ మధ్య అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గడం లేదు.
బండి సంజయ్ బైబిల్ వర్సెస్ భవవద్గీత కామెంట్స్
ఏపీ రాజకీయాల్లో బీజేపీకి దూకుడుగా వ్యవహరించిన చరిత్ర ఎన్నడూ లేదు. ఇక్కడి ప్రజల మనోభావాలను, రాజకీయాలు, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని చూసినా బీజేపీయే కాదు ఇతర పార్టీలు కూడా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు తక్కువగా కనిపిస్తాయి. కానీ ఏపీలో సాగుతున్న విగ్రహాల రాజకీయాన్ని తిరుపతి ఉప ఎన్నికకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మాత్రం అదే స్దాయిలో రాజకీయాన్ని రగిలిస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ తిరుపతిలో పోరు బైబిల్కూ, భగవద్గీతకూ మధ్యే అంటూ నిప్పు రాజేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర కలకలం రేపాయి.
బీజేపీ జోరుతో టీడీపీకి టెన్షన్
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి మద్దతిస్తున్న టీడీపీ.. తాజాగా జరుగుతున్న విగ్రహాల రాజకీయంలో బీజేపీని మించి దూకుడుగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మాత్రం కాషాయ పార్టీని టీడీపీ సమర్ధించడం లేదు. బండి వ్యాఖ్యలతో తిరుపతి రాజకీయం నిజంగానే మతం రంగు పులుముకుంటే ఈ ఉపఎన్నిక ఎక్కడ వైసీపీ వర్సెస్ బీజేపీగా మారిపోతుందో అన్న ఆందోళన టీడీపీలో మొదలైంది. దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టడం మొదలుపెట్టింది. బీజేపీ ఎక్కడైనా మిత్రుడే కానీ తిరుపతిలో మాత్రం కాదన్న చందాన టీడీపీ కౌంటర్లు ఇస్తోంది.
వైసీపీ వర్సెస్ బీజేపీగా మారకముందే...
రాష్ట్రంలో మిగిలిన చోట్ల బీజేపీ రాజకీయాన్ని సమర్ధిస్తున్నా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఆ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకే బండి సంజయ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎక్కడో తెలంగాణకు చెందిన నేత తిరుపతి ఉప ఎన్నికపై మతపరమైన వ్యాఖ్యలు చేయడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఆరంభంలోనే బీజేపీని అడ్డుకోలేకపోతే వైసీపీకి ప్రత్యర్ధిగా బీజేపీ మారిపోతుందన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీని మించి బీజేపీపై కౌంటర్ ఎటాక్ సాగించాలని టీడీపీ నిర్ణయించింది. రాబోయే రోజుల్లో బీజేపీ మత రాజకీయాలపై టీడీపీ మరిన్ని కౌంటర్లు సిద్ధం చేస్తోంది.