వీడిన మిస్టరీ: జయదీపికను చంపింది తండ్రే, టీడీపీకి రాజీనామా
తూర్పుగోదావరి: రామచంద్రపురంలో అక్టోబర్ 16న అర్ధరాత్రి జరిగిన నందుల జయదీపిక (20) హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ పరువు హత్య కేసులో అసలు నిందితుడు ఆ యువతి తండ్రి, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ అలియాస్ నందుల రాజు అని గుర్తించారు. ఈ మేరకు వివరాలను డీఎస్పీ జెవి సంతోష్ శుక్రవారం సమావేశంలో వెల్లడించారు.
నేరం కుమారుడిపై నెట్టేశాడు..
ఈ సంఘటనలో జయదీపికను హత్య చేసింది తన కుమారుడు నందుల జయప్రకాష్నాయుడు (నాని) అని నిందితుడు రాజు అభియోగం మోపుతూ ఫిర్యాదు చేశాడని తెలిపారు. తమ విచారణలో ఆయన కుమారుడు ఆ సమయంలో వారు నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు
నందుల రాజే హంతకుడు..
లోతుగా దర్యాప్తు చేయడంతో నందుల రాజే హతమార్చినట్లు తేలిందని చెప్పారు. కుమార్తె జయదీపిక వెల్ల గ్రామానికి చెందిన మణికంఠను ప్రేమించడం తండ్రికి ఇష్టంలేదని, సోమవారం రాత్రి ప్రేమ వ్యవహారంపై వివాదం జరిగిందని చెప్పారు. ఈ ఘర్షణలో కుమార్తె ఎదురుతిరగడంతో, ఆవేశంలో పక్కనే ఉన్న చెక్కబల్లతో జయదీపిక తలపై తండ్రి నందుల రాజు బలంగా కొట్టి చంపేశాడని తెలిపారు.
నిందితులను ఉపేక్షించం..
ఈ హత్య రాత్రి 12 గంటల సమయంలో జరిగిందని వివరించారు. ఆ తర్వాత కాసేపటికి జయదీపికను కొడుకు నానితో కలిసి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారని డీఎస్పీ సంతోష్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, ఇతర నిందితులెవరైనా ఉంటే వారిని ఉపేక్షించమని చెప్పారు.
హత్యారోపణలు.. టీడీపీకి రాజీనామా..
హత్యారోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష పదవికి తనపై వచ్చిన అభియోగాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు నందుల రాజు గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని టీడీపీ అధినాయకత్వాన్ని కోరామని తెలిపారు.
ఆ కారణంతోనేనా?: కొడుకు పైనే అనుమానం.. టీడీపీ నేత కూతురి హత్య మిస్టరీ!