కంటతడి పెట్టించిన అంబికా కృష్ణ బండారాన్ని బయటపెట్టిన పీతల సుజాత
ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలను చవి చూస్తోంది. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీని తీవ్రత ఏ స్థాయికి వెళ్లిందంటే.. మాజీ మంత్రి పీతల సుజాత బహిరంగంగా కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. తన జోలికి వచ్చిన వారెవరూ బాగుపడలేదని శాపనార్థాలు పెట్టేంత వరకూ వెళ్లింది ఈ వ్యవహారం. దీనితో- టీడీపీ అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు తమ ఓటమికి కారణమౌతాయనే ఆందోళన వారిలో నెలకొంది.
యూపీ తరహా పాలన ఏపీలో అందిస్తాం: పవన్ మా సీఎం అభ్యర్థి: ఆయనలో ఆ ఫైర్ ఉంది: మాయావతి
విషయం ఏమిటంటే..
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. మంత్రిగా పనిచేసినప్పటికీ.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఆమెకు టికెట్ ఇస్తే, ఓటమి ఖాయమని అంచనాకు అభ్యర్థిని మార్చారు. పీతల సుజాతకు బదులుగా రాజారావుకు బీఫారం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదట్లో అలకపూనిన పీతల సుజాత.. అనంతరం తన మనసు మార్చుకున్నారు. పార్టీ అభ్యర్థి కోసం ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
ఆమెకు పొగరు ఎక్కువ
పీతల సుజాతకు పార్టీ అగ్ర నాయకత్వం టికెట్ ఇవ్వకపోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, జిల్లా సీనియర్ నాయకులు అంబికా కృష్ణ. పీతల సుజాత ఎన్నో పాపాలు చేశారని, దాని ఫలితంగానే ఆమెకు టికెట్ రాలేదని ఆయన అన్నారు. నియోజకవర్గం పరిధిలోని జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ.. పీతల సుజాతపై ఘాటుగా కామెంట్స్ చేశారు. మంత్రి పదవి చేతిలో ఉన్నప్పటికీ.. ఆమె ఏనాడూ పార్టీ గురించి గానీ, నియోజకవర్గం అభివృద్ధి గురించి గానీ పట్టించుకోకుండా పాపాలు చేశారని అన్నారు. ఈ పాపాల ఫలితంగానే ఆమెకు టికెట్ రాలేదని చెప్పారు. పీతల సుజాతకు పొగరు ఎక్కువ అని చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నిధులను కూడా సరిగ్గా వాడుకోలేక పోయారని అన్నారు.
పీతల అనుచరుల్లో ఆగ్రహావేశాలు..
అంబికా కృష్ణ చేసిన కామెంట్స్ అదే సమావేశానికి హాజరైన పీతల సుజాత వర్గీయుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. అంబికా కృష్ణ వేదికపై మాట్లాడుతుండగానే.. ఆమె అనుచరులు లేచి నిల్చున్నారు. అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యానాల పట్ల అభ్యంతరం తెలిపారు. గొడవకు దిగారు. నేరుగా అంబికాతోనే వాగ్యుద్ధానికి దిగారు. పార్టీ సమావేశంలోనే రెండు వర్గాలుగా చీలిన టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొట్టుకోబోయారు. తోపులాట చోటు చేసుకుంది.
పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది ఓడించడానికా?
అంబికా కృష్ణ చేసిన కామెంట్లను పీతల సుజాత తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తనపై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అంబికా కృష్ణను తానే స్టార్ క్యాంపెయినర్ చేశానని అన్నారు. జిల్లా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది అభ్యర్థులను ఓడించడానికా అంటూ నిప్పులు చెరిగారు. తనను తీవ్ర అవమానాలకు గురి చేశారని, తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు.
అభ్యర్థుల్లో సంకటం..
పార్టీలో సీనియర్ నాయకులు, వారి వర్గీయుల్లో నెలకొన్న వాగ్యుద్ధంపై కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. పోలింగ్ ముంగిట్లో చోటు చేసుకున్నఈ పరిణామం పట్ల టీడీపీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీ పరువును రోడ్డున పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. వర్గపోరుతో సొంత క్యాడరే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రతికూల అంశాలుగా మారినట్లు చెబుతున్నారు. అంబికా కృష్ణ బహిరంగంగానే పీతల సుజాతపై విమర్శలు, ఆరోపణలు చేయటంతో.. బరిలో ఉన్న అభ్యర్థికి ఇది ఇబ్బందిగా మారింది.