స్కూటర్పై దేవినేని ఉమా హల్చల్: పోలీసుల కన్నుగప్పి: జాతీయ రహదారిపై బైఠాయింపు.. ఉద్రిక్తత.. !
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రోడ్డెక్కారు. జాతీయ రహదారుల దిగ్బంధనానికి దిగారు. వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మెరుపు ప్రదర్శనకు పూనుకున్నారు. వారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించడం, నిరసనకారులు వారిని అడ్డుకోవడం వంటి పరిణామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వెన్నుపోటు ఎమ్మెల్సీలు ఇంకెవరైనా ఉన్నారా? యనమలకు చంద్రబాబు ఫోన్: షోకాజ్ రెడీ.. !
స్కూటర్పై దేవినేని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. పార్టీ నాయకులతో కలిసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తన నివాసం నుంచి ఆయన స్కూటర్పై జాతీయ రహదారికి చేరుకున్నారు. ఇంటి బయట పహారా కాస్తోన్న పోలీసుల కన్నుగప్పి, ఆయన తన అనుచరుడి సహకారంతో హోండా యాక్టివా స్కూటర్పై గొల్లపూడి సమీపంలో జాతీయ రహదారిని ముట్టడించారు.
అడ్డుకోవడానికి ప్రయత్నం..
స్కూటర్పై దేవినేని ఉమా బయలుదేరి వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు తమ వాహనాలతో ఆయనను వెంటాడారు. కొంతదూరం వెళ్లిన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య దేవినేని ఉమా అక్కడి నుంచి జాతీయ రహదారి వైపు బయలుదేరి వెళ్లారు.
అమరావతిని కొనసాగించాలంటూ
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా సారథ్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు రాష్ట్రానికి శాపంలా మారిందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తన ఇష్టానుసారంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని, అడిగే వారెవ్వరూ లేరని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని తీరుతామని అన్నారు.
ఎమ్మెల్సీలకు కృతజ్ఙతలు..
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న తమ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులకు దేవినేని ఉమామహేశ్వర రావు కృతజ్ఙతలు తెలిపారు. అదే దూకుడును కొనసాగించాలని అన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో ఆమోదముద్ర వేయించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మండలి సభ్యులు.. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని తీరుతారని, వైసీపీ నేతల కలలను కల్లలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.