TDP: వైసీపీ వైపు టీడీపీ నేత?: విజయసాయి రెడ్డితో టచ్ లో.. !
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ మరోసారి వలసల బెడదను ఎదర్కోనుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తలోదారి చూసుకున్నారు. కొందరు భారతీయ జనతా పార్టీలోకి, మరి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. టీడీపీలో మరో విడత వలసలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విజయసాయి రెడ్డితో టచ్ లో..
తెలుగుదేశం పార్టీ నాయకుడు కోండ్రు మురళీ అధికార వైఎస్ఆర్సీపీ వైపు చూపులు సారించినట్లు చెబుతున్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనాపరమైన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డితో సంప్రదింపులు సాగిస్తున్నారని సమాచారం. తనతో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ ను కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో మంత్రిగా..
కోండ్రు మురళీ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హఠాన్మరణం అనంతరం.. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల అనంతరం కోండ్రు మురళి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు.
పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడంపై..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాను కోండ్రు మురళీ సమర్థించిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అలాంటి చోట రాజధానిని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. పరిపాలనా రాజధానిగా మారడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, వాటికి మౌలిక సదుపాయాలు అందుతాయని అన్నారు.
మురళీపై గుర్రు..
కోండ్రు మురళీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీతో ఏ మాత్రం సంబంధం లేవని కొందరు నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన పార్టీ కార్యకలాపాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చురకలు అంటిస్తున్నారు. అధికార పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, మూడు రాజధానుల అంశాన్ని ఓ సాకుగా చూపించి, వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు టీడీపీ నేతలు.