Nara Lokesh: జగన్ తీవ్ర ఆర్థిక నేరస్తుడు: నేడు మండలి.. రేపు కోర్టులను రద్దు చేస్తారా?
అమరావతి: రాష్ట్ర శాసన మండలిని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానం చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తప్పు పట్టారు. శాసన మండలిని రద్దు చేయడాన్ని ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చగా అభివర్ణించారు. మండలిని రద్దు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. మంత్రివర్గం తీర్మానం చేసిన వెంటనే.. నారా లోకేష్ వరుసగా ట్వీట్లను సంధించారు.
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నందుకే..
అమరావతి సహా రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఆమోదించని విషయం తెలిసిందే. దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లుకు శాసన మండలి మోకాలడ్డటాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏకంగా కౌన్సిల్నే రద్దు చేయడానికి పూనుకున్నారని అంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
కోర్టులను రద్దు చేస్తారా?
శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని చేయడం పట్ల నారా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన వైఎస్ జగన్కు ఆస్తుల కేసులో సీబీఐ న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మినహాయింపు ఇవ్వని కారణంగా న్యాయస్థానాలను కూడా వైఎస్ జగన్ రద్దు చేసేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటుండటం వల్ల.. వారానికి ఆరు రోజులేననే జీవోను తీసుకొస్తారా? అని నిలదీశారు. బిల్లును అడ్డుకున్నంత మాత్రాన ఏకంగా శాసన మండలినే రద్దు చేయబోతుండటం తుగ్లక్ చర్యగా అని విమర్శించారు.
ఆ బిల్లుల మాటేమిటీ?
ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర పురోగతికి దోహదపడే పలు బిల్లులు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నాయని, వాటి మాటేమిటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఆయా బిల్లులకు సంబంధించిన వివరాలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని గుర్తు చేశారు. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని, భయంతో వణికిపోతున్నారని అన్నారు.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా..
శాసన మండలిని రద్దు చేయడం అనేది ప్రజలు కోరుకున్నది కాదని నారా లోకేష్ అన్నారు. తన స్వార్థం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని స్వయంగా వైఎస్ జగనే నిండు శాసనసభలో అంగీకరించారని విమర్శించారు. వైఎస్ జగన్ తీసుకునే తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు వస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తానని అంటున్నారని, ఇలాంటి చర్యలు భారతదేశ చరిత్రలోనే లేవని ఆరోపించారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తాము తిరస్కరించలేదని, కొన్ని బిల్లులకు సవరణలు మాత్రమే అడిగామని అన్నారు. .