Chiranjeevi: మెగాస్టార్ ను టార్గెట్ చేసిన టీడీపీ: సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏం తెలుసంటూ చురకలు..!
నెల్లూరు: టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. తమదైన శైలిలో చిరంజీవిపై విమర్శలకు దిగుతున్నారు. పార్టీని నడిపించలేక చేతులు ఎత్తేసిన చిరంజీవికి రాజకీయాల గురించి గానీ, ఏపీ ప్రజల కష్ట సుఖాల గురించి గానీ మాట్లాడే హక్కు లేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఉంటూ వ్యాపారాలు, సినిమాలు చేసుకునే చిరంజీవికి ఏపీ గురించి ఏం తెలుసంటూ ఎద్దేవా చేస్తున్నారు.
రాష్ట్రంలో మూడు రాజధానులు రాబోయే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను చిరంజీవి స్వాగతించడమే దీనికి ప్రధాన కారణం. ఏపీకి మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఉందని, అలాంటప్పుడే మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధిని సాధించగలుగుతాయని చిరంజీవి అభిప్రాయపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సి ఉంటుందని సూచించారు.
ఓ రాజకీయ అంశంపై కేంద్ర మాజీమంత్రి హోదాలో చిరంజీవి స్పందించడం చాలాకాలం తరువాత ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం తెలుగుదేశం పార్టీ ఆగ్రహానికి కారణమైంది. తాజాగా ఆయనను టార్గెట్ గా చేసుకున్నారు. ప్రజల కోసమే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారని, ఫలితంగా- రాష్ట్ర విభజన పాపంలో భాగస్వామి అయ్యారని చిరంజీవిపై విమర్శలు గుప్పించారు.
చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్.. ప్రజల కోసం అహర్నిశలు పోరాడుతున్నారని, అలాంటి నాయకుడిని ఎందుకు భుజం తట్టి ప్రోత్సహించట్లేదని నిలదీస్తున్నారు. ఈ మేరుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్న చిరంజీవికి ఏపీ ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. వ్యాపారాలు, సినిమాలు చేసుకోకుండా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకని నిలదీస్తున్నారు.