కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ.. ఇక బీజేపీ: ఢిల్లీలో మాజీమంత్రి: కాషాయ కండువాకు ముహూర్తం ఫిక్స్!
కడప: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. ఇదివరకే టీడీపీని వీడారు. కేంద్ర మాజీమంత్రి, తోటి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన కాషాయ కండువాను కప్పుకొన్నారు. తాజాగా- అదే పార్టీకే చెందిన మరో మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా భారతీయ జనతాపార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. గురువారం ఆయన దేశ రాజధానిలో బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. దీనికోసం ఆయన బుధవారం రాత్రే న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డితో పాటు ఆయన క్యాడర్ మొత్తం టీడీపీని వీడటానికి సిద్ధపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ మంత్రివర్గంలో
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల్లోనే తెలుగుదేశం వలసల బారిన పడింది. పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే జాబితాలో ఆదినారాయణ రెడ్డి చేరడం కలవరపాటుకు గురి చేస్తోంది. నిజానికి- ఆదినారాయణ రెడ్డి స్వతహాగా టీడీపీ నాయకుడు కాదనే విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల గూటికి చెందిన నాయకుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. 2014 ఎన్నికల్లో ఆయన జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ ఫిరాయించారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
కాంగ్రెస్..వైసీపీ..టీడీపీ ఇక బీజేపీ
కాంగ్రెస్ తో ఆరంభమైన ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీ వరకూ వెళ్లింది. ఈ మధ్యలో ఆయన మారని పార్టీ అంటూ ఏదీ లేదు. తొలుత కాంగ్రెస్.. ఆ తరువాత వైఎస్సార్సీపీ, మరోసారి తెలుగుదేశం, ఇక బీజేపీ ఇలా సాగిందాయన రాజకీయ ప్రయాణం. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆదినారాయణ రెడ్డి ఏదో ఒకరోజు బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు మొదటి నుంచీ వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన ఏనాడూ ఖండించనూ లేదు. తనకు దేశభక్తి అధికమని, అందుకే బీజేపీలో చేరుతానంటూ కొద్దిరోజుల కిందటే కుండబద్దలు కొట్టారు. వైఎస్సార్సీపీలో చేరడానికి ఆయన మొదట్లో ప్రయత్నాలు సాగించారు. అగ్ర నాయకత్వం నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.
జమ్మలమడుగులో బీజేపీ జెండా ఎగరేనా?
రాజకీయంగా మనుగడ సాగించడానికి టీడీపీని వీడక తప్పదని భావించారు. బీజేపీలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఆయన బీజేపీలో చేరడం వెనుక సీఎం రమేష్ ఒత్తిడి కూడా పని చేసిందంటున్నారు. జమ్మలమడుగులో మూడోపార్టీకి ఇప్పటిదాకా స్థానం దక్కలేదు. కాంగ్రెస్ లేదా తెలుగుదేశం.. ఈ రెండు పార్టీల చేతుల్లోనే ఎమ్మెల్యే పదవి కొనసాగుతూ వచ్చింది. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటూ వచ్చింది ఈ నియోజకవర్గం. పొన్నపురెడ్డి శివారెడ్డి ఆయన మరణానంతరం సోదరుడి కుమారుడు రామసుబ్బారెడ్డి జమ్మలమడుగును ఏలుతూ వచ్చారు. 2004లో ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ ఛరిష్మాతో ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో- బీజేపీ జెండా ఏ స్థాయిలో ఎగురుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదినారాయణ రెడ్డి క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థాన్ని పుచ్చుకోగలిగితేనే అది సాధ్యపడే అవకాశం ఉంది.