అప్పుడు విన్యాసాలు .. ఇప్పుడు మోసాలా .. వైసీపీకి మహిళల ఉసురు తగులుతుంది : అనిత
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా కష్టకాలంలోనూ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనుంది . ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించనున్న నేపధ్యంలో సీఎం జగన్ మహిళలను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత . ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డేరింగ్ డెసిషన్ తీసుకున్నారని రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఈ కష్టకాలంలోనూ గుడ్ న్యూస్ చెప్తున్నారని వైసీపీ నేతలు చెప్తుంటే టీడీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు .
పొదుపు సంఘాల మహిళలకు జీరో వడ్డీ రుణాలను ఇవ్వటం ద్వారా వారి ఆర్ధిక స్వావలంబనకు ఆలంబన ఇస్తామని సీఎం జగన్ చెప్తున్నారు. కానీ జీరో వడ్డీ పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచి మహిళలను మోసం చెయ్యటానికి కొత్త ఎత్తుగడ వేశారని విమర్శిస్తున్నారు అనిత . వైసీపీ ప్రభుత్వ మాట తీరు మాటలు కోటలు దాటినా పనులు మాత్రం గడప దాటటం లేదని ఆమె పేర్కొన్నారు . సున్నా వడ్డీ పేరుతో డ్వాక్రా మహిళలను వైసీపీ మోసం చేస్తోందని, ఆ పార్టీ నేతలకు మహిళల ఉసురు తగులుతుందని టీడీపీ నేత అనిత హెచ్చరించారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు .అప్పుడు విన్యాసాలు చేసి ఇప్పుడు మోసాలు చేస్తున్నారన్నారు .
Recommended Video
డ్వాక్రా మహిళలకు 27, 450కోట్లు రుణ మాఫీ చేస్తామని, మరో 75 వేలు డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు కరోనా టెన్షన్ లో ఉన్న సమయంలో ఎవరూ పట్టించుకోరని భావించి ఈ తరహా మోసం చెయ్యటం దారుణం అని పేర్కొన్నారు . రుణ మాఫీ చేస్తామని చెప్పి మహిళలను ఆదుకుంటామని సీఎం జగన్ మాయమాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆయన మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కన్పించడంలేదా? అని ప్రశ్నించారు. విపత్కర కాలంలో ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకోవటానికి పరిమితమైనారని ఆమె విమర్శించారు . మహిళలకు జీరో వడ్డీ పథకం ఒక మోసం అని , మహిళలు తప్పక అర్ధం చేసుకుంటారని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీఎం జగన్ పై , అలాగే వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు .