చంద్రబాబు తీరు నచ్చట్లేదంటూ: టీడీపీకి అన్నపురెడ్డి రాజీనామా
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అంతిమ యాత్ర సాక్షిగా అదే పార్టీకి చెందిన నాయకుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు. కోడెల మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో చంద్రబాబు తీరు సరిగ్గా లేదనంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన తీరును తప్పుపడుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని నరసరావుపేటలో కోడెల భౌతిక కాయానికి అంతిమయాత్ర ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. కోడెల మరణాన్ని తనకు అనుగుణంగా, రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా ఎదురుదాడి చేయడానికి తమ నాయకుడు కోడెల మరణాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.
కోడెల మరణానంతరం చంద్రబాబు ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు మింగుడు పడట్లేదని విమర్శించారు. కోడెల మరణంపై ఒక్కసారి కూడా చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేయలేదనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పార్టీ మీద అభాండాలను వేయడానికి కోడెల మరణాన్ని సైతం చంద్రబాబు వినియోగించుకుంటున్నారని అన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆయన కుటుంబ సభ్యులేననే విషయం.. పల్నాడులో ఏ ఒక్కర్ని అడిగినా చెబుతారని, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఆ విషయం తెలిసి కూడా కోడెల ఏమీ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల ఆత్మహత్య చేసుకున్న తరువాత పల్నాడు ప్రాంతంలో సామాన్య ప్రజలు ఎవరూ ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదని అన్నారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ సభ్యులే కారణమనే అభిప్రాయం వారిలో నెలకొందని, ప్రభుత్వాన్ని లాగడం.. కేవలం రాజకీయ అవసరాలేనని టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు సైతం చెబుతున్నారని నర్సిరెడ్డి తెలిపారు. ఇదంతా చంద్రబాబుకు తెలియనిది కాదని, అయినప్పటికీ.. రాజకీయంగా కోడెల మరణాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. పార్టీలోని కొందరు నాయకులు కోడెల ఆత్మహత్య పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు పార్టీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయమని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కొనసాగలేనని, కొనసాగాల్సిన పరిస్థితే వస్తే.. ఆత్మవంచన చేసుకున్నట్టేనని నర్సిరెడ్డి అన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.