కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తదితరులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, అలాగే యనమల రామకృష్ణుడు మరోమారు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.
సీఎం 50 మంది సలహాదారులు ఏం చేస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు
సీఎం జగన్ ఏడాది పాలన బాగోలేదని తాను మాట్లాడటం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కర్మ కాలి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డికి 50 మందికి పైగా సలహాదారులు ఉన్నారు. రాష్ట్రంలో పాలన ఈ విధంగా ఉంటే వీరంతా ఏం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
జగన్ కు ఐఏఎస్ లను జైలుకు తీసుకెళ్ళే అలవాటు అన్న టీడీపీ నేత
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కౌంట్ డౌన్ ప్రారంభమైందని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు, జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆయనే కాదు అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కి తన వెంట కొంత మంది ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్ళే అలవాటని, ఇప్పుడు అదే విధంగా అధికారులతో చట్ట వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక వైసిపి నాయకులే, సాక్షాత్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏపీలో వైసీపీ ప్రభుత్వపాలన ఏ విధంగా ఉందో చెప్తున్నారని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.
Recommended Video
జగన్ ది అరాచక పాలన : యనమల
ఇక టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన అడ్డుకోవడం ఒక్క కోర్టులకే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రైతులకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని, అనకాపల్లి లో ఏర్పాటు చేసిన ఉద్యానవన అధ్యయన కేంద్రాన్ని రద్దుచేసి పులివెందులలో ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ హయాంలో ఏపీలో అంతా విధ్వంసమే కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.