ఏ-2కి మందెక్కిందా? చంచల్గూడా అల్లుడా.. అంటూ విజయసాయికి అయ్యన్న దిమ్మతిరిగే కౌంటర్
ఏపీలో ఈఎస్ఐ స్కాం, చంద్రబాబు గత నిర్ణయాలపై సిట్ ఏర్పాటు వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈఎస్ఐ స్కాం సూత్రధారి అచ్చెన్నాయుడు.. చంద్రబాబుపై ఎదురుతిరిగాడని, అందరూకలిసి ఊచలు లెక్కబెట్టేరోజు తొందర్లోనే వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించగా... ఆయనను 'చంచల్ గూడా అల్లుడు''గా అభివర్ణిస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అదిరిపోయే రిటార్ట్ ఇచ్చారు.
Recommended Video
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈఎస్ఐ స్కాం, సిట్ అక్రమాల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. ‘రంగస్థలం'సినిమా పాట తరహాలో.. సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ గుర్తుకొచ్చేలా.. ‘‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న? ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల.. అసలే ఎండాకాలం.. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో? ''అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా అయ్యన్న కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయనేమన్నారంటే..
గాల్లో కలిసిపోయారు..
‘‘ఏ2కి పిచ్చెక్కిందా? మందెక్కిందా? ఎప్పుడూ జైలు జైలు అని కలరిస్తాడెందుకు? చూడు చంచల్గూడ అల్లుడా.. ఇవతలున్నది చంద్రబాబు. నీలాంటి ఎందరో అవినీతి పితామహులు బురద జల్లాలని చూశారు. బట్ వాళ్లే గాలిలో కలిసిపోయారు. అధికార మదంతో విర్రవీగుతూ.. ఫ్రీగా ఉందికదాని సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాయకు..''అని అయ్యన్న మండిపడ్డారు.
కుక్కలు అరవడం కామనే..
ఖాళీగా కూర్చొని సోషల్ మీడియాలో సొల్లు రాతలు రాసేబదులు.. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నమేదైనా చేస్తే మంచిదని వైసీపీ ఎంపీకి టీడీపీ నేత అయ్యన్న సూచించారు. కేంద్ర నుంచి నిధులు రాకున్నా, బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేకున్నా వైసీపీ నేతలు కిక్కురుమనడంలేదని, పైగా సొల్లు కబుర్లు చెబుతూ బతికేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చెయ్యలేరని,.. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం కామనే అని అయ్యన్నపాత్రుడు రాసుకొచ్చారు.
స్కాంలో వాటాలు లోకేశ్ కు..
అయ్యన్న రియాక్ట్ కావడానికి ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేరును కూడా ప్రస్తావించారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు దోచిన డబ్బులో సగం లోకేశ్ కు పంపాడు కాబట్టే.. అంతా చంద్రబాబు చూసుకుంటారన్న భరోసాతో ధీమాగా ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు.