మోత్కుపల్లి ఆగంచేశారు, మీ శిష్యురాలిగానే బతుకుతా: ఒక్క ఛాన్స్ అంటూ శోభారాణి కంటతడి
ఆలేరు: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తనను నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు నడిబజారులో వదిలేశారని తెలుగుదేశం పార్టీ నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి శనివారం కంటతడి పెట్టారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రణభేరి సభలో ఆమె మాట్లాడారు. తనను ఆలేరు నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేసిన ఘనతతో పాటు తన రాజకీయ జీవితాన్ని ఆగం చేసిన ఘనత కూడా మోత్కుపల్లిదే అన్నారు.
దొరా.. గమనిస్తున్నా, సర్వస్వం అప్పగించా: విజయశాంతి, కూలిన వేదిక, కిందపడిన రాములమ్మ
గవర్నర్ను అవుతానని చెప్పి, కోట్లు ఖర్చు పెట్టించాడు
నేను గవర్నర్ను అవుతానని, నిన్ను ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను చేస్తానని పలు సభలు, సమావేశాల్లో హామీ ఇచ్చారని బండ్రు శోభారాణి వాపోయారు. తనతో కోట్ల రూపాయలను ఖర్చు చేయించారని మండిపడ్డారు. ఇపుడు తన రాజకీయ జీవితాన్ని మోత్కుపల్లి నర్సింహులు మొత్తం ఆగం చేశారని కన్నీరుమున్నీరు అయ్యారు.
అప్పుడు సరే, ఇప్పుడు ఎవరిని గెలిపిస్తావ్
ఇటీవల నిర్వహించిన సభలోను మోత్కుపల్లి నర్సింహులు తాను ఎవరెవరినో గెలిపించినట్లు చెప్పుకున్నారని బండ్రు శోభారాణి అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్యను, టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతను గెలిపించానని ఆయన మాట్లాడారని, ఇపుడు ఎవరిని గెలిపిస్తారో చెప్పాలని ఆమె నిలదీశారు.
వారిని గెలిపించినట్లు నన్ను గెలిపించు
తాను ఎప్పుడు కూడా మోత్కుపల్లి నర్సింహురాలి శిష్యురాలినేనని బండ్రు శోభారాణి చెప్పారు. గతంలో బిక్షమయ్యను, సునీతలను గెలిపించినట్లు ఇప్పుడు తనకు సహాయం చేయాలని చెప్పారు. తనను గెలిపించాలని సూచించారు. ఇప్పటికే తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మోత్కుపల్లి ఇతర పార్టీల నేతలను ఎలా గెలిపిస్తారని, ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. సునీతను, భిక్షమయ్యలను ఎలా గెలిపిస్తున్నారన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ మోత్కుపల్లి శిష్యురాలిగానే బతుకుతానని, తన రాజకీయ జీవితాన్ని ఆగం చేసి, కోట్లు ఖర్చు పెట్టించారని మండిపడ్డారు. తాను పేదింటి ఆడపడుచునని, రెడ్డి కులంలో పుట్టినా బలహీనవర్గాల వ్యక్తిని పెళ్లి చేసుకొని, ప్రజల మధ్య గడుపుతున్నానని, నన్ను ఎవరూ ఆగం చేసినా, మీ గుండెల్లో పెట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నానని కంటతడి పెట్టారు. నేను ఆయనను తప్పుపట్టదల్చుకోలేదన్నారు. టీడీపీలో ఉండి ఇతర నేతలను గెలిపించిన మోత్కుపల్లి, ఇప్పుడు మీ శిష్యురాలిగా మీ అడుగులో అడుగు వేసిన తనను గెలిపిస్తారా అని ప్రశ్నించారు.
ఆలేరుపై బండ్రు శోభారాణి ఆశలు
కాగా, తెలుగుదేశం, మహాకూటమిలో భాగంగా ఆలేరు నియోజకవర్గం నుంచి బండ్రు శోభారాణి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి 15 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, ఆ పార్టీ మాత్రం దాదాపు 30 సీట్లు అడుగుతోంది. సీట్లు కొలిక్కి రాలేదు. కూటమి తరఫున బండ్రు శోభారాణి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు.