జగన్ తీరు వల్లే కరోనా వ్యాప్తి: వైసీపీ నేతలు బాధ్యులు: బ్లీచింగ్ వాడట్లేదా? భూమా అఖిల ఫైర్
కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంత భారీగా పెరడగానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కరోనా వైరస్ తీవ్రతను తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ టాబ్లెట్లతో తగ్గిస్తామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. బుధవారం ఆమె తన అధికారిక ట్విట్టర్లో వరుసగా వీడియోలను పోస్ట్ చేశారు.
కర్నూలులో డబల్ సెంచరీ: కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు: 800 మార్క్ జంప్
వైసీపీ నేతల వల్లే కరోనా
ఒకవంక దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్తో తగ్గించగలమనే సందేశఆన్ని ప్రజల్లో తీసుకెళ్లారని, ఫలితంగా వారు అప్రమత్తంగా లేకుండా పోయారని అన్నారు. వైరస్ ప్రభావాన్ని చూపుతోన్న తొలి రోజుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంపై చూపిన శ్రద్ధ కరోనా వైరస్ నియంత్రణపై ఎందుకు పెట్టలేదని నిలదీశారు. కరోనా వైరస్ రాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా ప్రచారాన్ని చేశారని, దాని వల్ల తీవ్రత పెరిగిందని భూమా అఖిలప్రియ ఆరోపించారు.
క్రిమినల్ కేసులు నమోదు..
కర్నూలు జిల్లాలో భారీగా కరోనా వైరస్ కేసులు పెరగడానికి గల కారణాలను ప్రభుత్వం అన్వేషించాలని భూమా అఖిల డిమాండ్ చేశారు. దీని వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. కరోనా వైరస్ ఒక్క కర్నూలు జిల్లాకే పరిమితం కావట్లేదని, రాయలసీమ జిల్లాలను విస్తరించిందని, అధికారులు సైతం దీని బారిన పడి మరణిస్తున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైన వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి చర్యల వల్ల అక్కడ కేసులు మరిన్ని పెరిగాయని అన్నారు.
Recommended Video
రైతులను నమ్మించి మోసం
తాము అధికారంలోకి వస్తే.. రైతులు రాజు అవుతారంటూ వైఎస్ఆర్సీపీ నమ్మించి మోసం చేసిందని భూమా అఖిలప్రియ విమర్శించారు. రాయలసీమలో గిట్టుబాటు ధర ఎక్కడ కల్పిస్తున్నారని నిలదీశారు. రైతులు ఇబ్బందులు పడితే వారు పెట్టే కన్నీళ్లలో మనందరం కొట్టుకుని పోతామని అన్నారు. రైతులను ఆదుకోకపోతే వారంతా తిరగబడుతారని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పెరగడానికి 39 శాతం మేర అవకాశం ఉందంటూ కేంద్రం నిర్వహించిన సర్వేలో తేలిందని, అయినప్పటికీ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు.