టీడీపీ నేత హత్యకు సుపారీ: చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త: పీఏ అరెస్టు: సూత్రధారి అతనేనా?
కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయాత్నం కేసులో పోలీసులు బ్రేక్ త్రూ సాధించారు. ఈ కేసులో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ వ్యక్తిగత సహాయకుడు మాదా శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి బుల్లెట్లతో లోడ్ చేసి ఉన్న తుపాకి, బుల్లెట్లు, సుమారు మూడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆర్థిక విభేదాల వల్ల..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా కుటుంబం ఇదివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగింది. ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే పార్టీలో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలు. కాంట్రాక్టులను దక్కించుకోవడం, కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన వివాదాాలు చాలాకాల నుంచి నడుస్తున్నాయి. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి హఠాన్మరణం కూడా ఆ వివాదాలు చల్లారలేదు. ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ..ఫలితం లేదు. హత్య చేయడానికి రెక్కీ నిర్వహించే స్థాయికి చేరుకున్నాయి.
తనను హత్య చేయడానికి కుట్ర..
తనను హత్య చేయడానికి భూమా కుటుంబం విశ్వ ప్రయత్నాలను చేస్తోందంటూ కొద్దిరోజుల కిందట ఏవీ నాగిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఏదైనా జరిగితే దానికి భూమా కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఆయన అప్పట్లో విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ బహిరంగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగించారు. ఏవీ సుబ్బారెడ్డి అనుమానించినట్లుగానే ఈ కేసు భూమా అఖిలప్రియ కుటుంబంతో ముడిపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
50 లక్షల రూపాయలు సుపారీగా..
ఈ కేసులో పోలీసులు భార్గవ్ రామ్ వ్యక్తిగత సహాయకుడు మాదా శ్రీనివాసులును అరెస్టు చేయడం కలకలం రేపింది. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి 50 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మూడు నెలల కిందటే ఆయనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ధృవీకరించారు. రెక్కీ నిర్వహించిన ఘటనలో ఒక మాజీ మావోయిస్టు సహా ముగ్గురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన సందర్భంగా మాదా శ్రీనివాసులు పేరు వెల్లడైనట్లు తెలుస్తోంది.
బెయిల్పై ఉన్న భార్గవ్ రామ్..
భార్గవ్ రామ్పై ఇదివరకే కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కారణంగా కేసు పెట్టారు. ఓ స్టోన్ క్రషింగ్ వివాదంలోనూ ఆయనపై కేసులు ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో ఆయన గత ఏడాది నుంచి బెయిల్పై ఉంటున్నారు.