టీడీపీకి భూమా ఫ్యామిలీ గుడ్బై: ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం. భూమా సోదరులు తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. దీనితో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఏకైక పెద్ద దిక్కు భూమా కుటుంబం. అదే కుటుంబానికి చెందిన భూమా కిశోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్ర రెడ్డి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఇది తొలిదశ మాత్రమేనని తెలుస్తోంది. రెండో దశలో- మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా కాషాయ కండువాను కప్పుకోవచ్చని సమాచారం.
యడ్డీకీ బల పరీక్షే: 29 లేదా 31న విశ్వాస తీర్మానం?
ఎడా పెడా ఫిరాయింపులకు ప్రోత్సాహం
అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఎడాపెడా ఫిరాయింపులను దగ్గరుండి మరీ ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇక వరుస బెట్టి షాకులు తగులుతున్నాయి. ఏ ఫిరాయింపుదారులనైతే ఆయన తమ పార్టీలోకి చేర్చుకున్నారో.. వారే ఇప్పుడు చంద్రబాబుకు మొట్టికాయ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలు ముగియగానే గుడ్బై చెబుతున్న తమ్ముళ్లు..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొద్దిరోజుల్లోనే ఖాళీ కావడం సంచలనం రేపుతోంది. ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు లేరనే అనుకోవచ్చు. బీసీ జనార్ధన్, బీవీ జయనాగేశ్వర రెడ్డి వంటి వారు తప్ప పార్టీకి నాయకత్వాన్ని వహించగల నేత ప్రస్తుతానికి కనిపించట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియను పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయన అనుకున్నది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటి. నాగిరెడ్డి హఠాన్మరణానికి గురి కావడం, భూమా అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ.. జిల్లా రాజకీయాలపై పట్టు సాధించలేకపోవడం పార్టీని దిగజార్చింది.
బీజేపీలో భూమా బ్రదర్స్..
ఈ నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీలో కొనసాగితే మనుగడ ఉండదని భావిస్తోంది భూమా కుటుంబం. అందుకే- పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారులు, ద్వారాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వారు భారతీయ జనతాపార్టీ వైపు చూపులు సారించినట్లు చెబుతున్నారు. తొలుత- అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కిశోర్ రెడ్డితో పాటు వీరభద్రా రెడ్డి, మహేశ్వర్ రెడ్డి కూడా టీడీపీని వీడారు. బీజేపీలో చేరారు. క్రమంగా- అఖిలప్రియ, బ్రహ్మానంద రెడ్డి ఇద్దరూ కాషాయ కండువాను కప్పుకోవచ్చని సమాచారం. దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిశోర్ రెడ్డి. మండల పరిషత్ మాజీ సభ్యుడు కూడా.
ప్రాభవాన్ని కోల్పోయినట్టేనా?
జిల్లా రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మొదట కోట్ల, ఆ తరువాత భూమా. ఈ రెండు కుటుంబాలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య భూమా శోభా నాగిరెడ్డి హఠాన్మరణాల అనంతరం ప్రస్తుతం ఆ కుటుంబం ప్రాబల్యం తగ్గింది. ప్రాభవాన్ని కోల్పోయే దశకు చేరుకుంది. భూమా దంపతుల కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినప్పటికీ.. జిల్లా రాజకీయాలపై ఆమె పట్టు సాధించలేకపోయారు. దీనికి నిదర్శనం- మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం. అఖిలప్రియ మాత్రమే కాదు.. ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం పరాజయాన్ని చవి చూశారు.