టీడీపీ నేత దారుణ హత్య.. కర్నూలులో వేట కొడవళ్లతో ప్రత్యర్థుల దాడి
కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు మరోమారు అశాంతిని రేపుతున్నాయి. కర్నూలు జిల్లా వాసులు తాజా పరిణామాల నేపథ్యంలో అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కాపు కాసి మరీ కిరాతకంగా టీడీపీ నేత హత్య
బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన టిడిపి నేత సుబ్బారావును ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. రెండు స్కార్పియో వాహనాలలో వచ్చిన ప్రత్యర్ధులు ఒక్కసారిగా ఆయన పైకి దాడికి దిగారు.అత్యంత కిరాతకంగా హత్య చేశారు. నేడు మధ్యాహ్నం కాపు కాసి మరీ ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపి, అనంతరం బండరాయితో తలపై మోది పరారయ్యారు.
వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు
హత్యకు గురైన సుబ్బారావు స్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయ పల్లె. అయితే వ్యాపార లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి లో సుబ్బారావు గ్రానైట్ వ్యాపారం చేసేవాడు.గత కొన్ని రోజులుగా వ్యాపార లావాదేవీలలో భాగంగా ప్రత్యర్థులతో సుబ్బారావుకు గొడవలు జరుగుతూ ఉండేవని తెలుస్తోంది.
వేట కొడవళ్ళతో నరికి చంపిన ప్రత్యర్ధులు
ఇక ఈ నేపథ్యంలో బెలూన్ గుహల సమీపంలో పనులు జరుగుతుండగా అక్కడికి వెళ్ళిన సుబ్బారావును పక్కా ప్లాన్ ప్రకారం కాపు కాసిన ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో నరికి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం,డాగ్స్ స్క్వాడ్ లతో తనిఖీలు చేస్తున్నారు హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో కర్నూలు వాసులు ఉన్నారు.