మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు
ఏపీలో ఎన్నికలు ముగిసినా ఉద్రిక్త వాతావరణం మాత్రం ఇంకా కొనసాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరా నగర్ నాలుగో వార్డులో నివాసముండే తాడిబోయిన ఉమా యాదవ్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది .
ముగ్గురు దుండగులు కత్తులతో వచ్చి హత్యచేసి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వచ్చింది ఎవరు ? ఎందుకు హత్య చేశారు ? ఏమైనా రాజకీయ కక్షలా ? లేదా వ్యక్తిగత కక్షలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
ఉమా యాదవ్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు అనుచరుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు కాండ్రు కమలతో పాటు టీడీపీలో చేరిన ఉమా యాదవ్ ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరినా ఉమా యాదవ్ మాత్రం టీడీపీలోనే ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కోసం బాగానే పని చేశారు . దుండగుల దాడిలో మృతి చెందిన ఉమా యాదవ్ గతంలో జరిగిన ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో మంగళగిరిలో కీలక నేతగా వ్యవహరించిన ఉమా యాదవ్ హత్యకు గురికావటం పట్ల టీడీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇక గత ఎన్నికల్లో మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ గెలవాలని ఉమా యాదవ్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు . ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.